Water Powered Plane:ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతూ, ఇంధన సంక్షోభంపై ఆందోళనలు పెరుగుతున్న సమయంలో విమానయాన రంగంలో కొత్త ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది.
ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్తో విమానాలు నడవగా, తొలిసారి నీటితో నడిచే విమానం గాల్లోకి ఎగిరింది. తాజాగా నిర్వహించిన పరీక్షలో ఈ విమానం సక్సెస్ ఫుల్ గా ఆకాశంలో చక్కర్లు కొట్టింది. విమానయాన రంగంలో అద్భుతానికి కారణం అయ్యింది.
అద్భుతాన్ని ఆవిష్కరించిన డ్రాగన్ కంట్రీ
ఈ అద్భుతమైన విమానాన్ని చైనా రూపొందించింది. 2026 ఏప్రిల్ 4న హునాన్ ప్రావిన్స్ లో ఉన్న జుజౌ విమానాశ్రయం నుంచి ఈ మానవరహిత కార్గో విమానాన్ని పరీక్షించారు. ఈ విమానం సుమారు 7.5 టన్నుల బరువుతో గాల్లోకి ఎగిరి 300 మీటర్ల ఎత్తులో ప్రయాణించింది. గంటకు దాదాపు 220 కిలోమీటర్ల వేగంతో 36 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. సుమారు 16 నిమిషాల తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయింది.
హైడ్రోజన్ తో నడిచిన ఎయిర్ క్రాఫ్ట్
ఈ విమానం నీటితో నడుస్తుంది. ఇందులో హైడ్రోజన్ టర్బోప్రాప్ ఇంజిన్ ను ఏర్పాటు చేశారు. చైనా ఏరో ఇంజన్ కార్పొరేషన్ ఈ ఇంజిన్ ను ఏర్పాటు చేసింది. ఈ స్థాయి శక్తితో హైడ్రోజన్ ఇంజిన్ ఉపయోగించిన ప్రపంచంలోని తొలి ప్రయోగం ఇదేనని చైనీస్ మీడియా వెల్లడించింది. సాధారణంగా విమానాల్లో కిరోసిన్ ఆధారిత ఇంధనాన్ని ఉపయోగిస్తారు. కానీ, ఈ కొత్త ఇంజిన్ లో లిక్విడ్ హైడ్రోజన్ ను నేరుగా మండించి శక్తిని ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం పాశ్చాత్య దేశాలు ఎక్కువగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ పై దృష్టి పెడుతుండగా, చైనా మాత్రం నేరుగా హైడ్రోజన్ ను మండించే టెక్నాలజీపై ముందుకెళ్తోంది.
హైడ్రోజన్ ఇంధనంతో పనిచేసే విమానాలకు కొన్ని పెద్ద సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా హైడ్రోజన్ను మైనస్ 253 డిగ్రీల సెల్సియస్ లాంటి అత్యంత చల్లని ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. అలాగే, విమాన ప్రయాణం మొత్తం సమయంలో దాన్ని సురక్షితంగా మెయింటెయిన్ చేయడం సాంకేతికంగా చాలా క్లిష్టమైన పని. అయితే, ఈ పరీక్షలో ఇంజిన్ స్టేబుల్ గా పని చేసిందని చైనా అధికారులు తెలిపారు. ఈ టెక్నాలజీని ముందు కార్గో రవాణా, ద్వీపాల మధ్య సరుకు రవాణా, తక్కువ దూర రీజినల్ సేవల్లో ఉపయోగించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రయాణికుల విమానాల కంటే కార్గో రంగంలో కొత్త టెక్నాలజీలను పరీక్షించడం ఈజీగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మూడు దశల్లో విమాన పరీక్షలు
చైనా ఇంజినీరింగ్ అకాడమీకి చెందిన పరిశోధకులు.. హైడ్రోజన్ విమానయానానికి మూడు దశల ప్రణాళిక సిద్ధం చేశారు. 2028 నాటికి విమాన్నితయారు చేయడం, 2035 నాటికి ప్రాంతీయ విమానాల్లో వినియోగించడం, 2050 నాటికి కమర్షియల్ విమానాల్లో ఈ టెక్నాలజీని ఉపయోగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ ఆధారిత విమానాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఎయిర్ బస్ లాంటి సంస్థలు కూడా ఈ రంగంలో పని చేస్తున్నాయి. అయితే, చైనా ప్రయోగం భవిష్యత్తులో విమానయాన రంగాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: పెట్రోల్ వినియోగంలో గోవా టాప్.. మరీ తక్కువ వాడే స్టేట్ ఏదో తెలుసా?

