Green Transport: స్వేచ్ఛ బ్యూరో: దేశంలోనే మొట్టమొదటిసారిగా కాలుష్య నివరణకు తెలంగాణలో విద్యుత్ (ఎలక్ట్రికల్) బస్సులను విజయవంతంగా నడుపుతున్నామని ఆర్టీసీ ఎండీ వై.
నాగిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా రవాణా రంగంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ) వినియోగంలో ఆర్టీసీ అగ్రగామిగా నిలుస్తోందని వెల్లడించారు. ఉత్తరాఖండ్ లోని ముస్సోరీ వేదికగా ఆదివారం అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) అఖిల భారత సమావేశం ఆయన అధ్యక్షత వహించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా..
దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్టీసీల ఛైర్మన్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొని రవాణా రంగ పురోగతిపై చర్చించారు. ఆర్టీసీ సంస్థలకు స్పేర్ పార్ట్స్ సరఫరా చేసే వెండర్స్ తో భేటీ నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగాపెరుగుతున్న స్పేర్ పార్ట్స్ ధరలను ఎలా అధిగమించాలనే అంశంపై అసోసియేషన్ చైర్మన్ వై.నాగిరెడ్డి పలు సూచనలుచేశారు. పెరుగుతున్న ధరల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు, ఆర్టీసీలపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
Also read: డేంజర్ బెల్స్.. వచ్చే వారం రోజులు రాష్ట్రానికి ఎండల గండం..!
హైదరాబాద్ నగరాన్ని..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్సుల సమర్థవంతమైన నిర్వహణలో ఆర్టీసీ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని పర్యావరణ అనుకూల విద్యుత్ బస్సులను తీసుకువచ్చి, హైదరాబాద్ నగరాన్ని పూర్తి కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా, అంతర్గత నిర్వహణను సైతం డిజిటలైజ్ చేస్తున్నట్లు వివరించారు. ఆర్టీసీ గ్యారేజీల నిర్వహణలో అధునాతన సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
నమ్మకమైన సేవలు..
వాహనాల ఫిట్నెస్, విడిభాగాల లభ్యత, మెయింటెనెన్స్ షెడ్యూళ్లను పూర్తి డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించడం ద్వారా బస్సుల సామర్థ్యం పెరగడమే కాకుండా, ప్రయాణీకులకు మరింత సురక్షితమైన, నమ్మకమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు. 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మాట్లాడారు. ఈ పథకం ద్వారా అనతికాలంలోనే రికార్డు స్థాయిలో 10 వేల కోట్ల ప్రయాణాలనుపూర్తి చేయడంపై వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు అభినందించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్.వెంకన్న, ఉత్తరాఖండ్, కర్ణాటక, ఒరిస్సా ఇతర రాష్ట్రాల ఆర్టీసీ ఛైర్మన్లు పాల్గొన్నారు.
గద్వాల్లో జోరుగా క్రికేట్ బెట్టింగ్ దందా.. 100 నుండి లక్ష వరకు పందెం కాస్తున్న రాయుళ్లు!

