Cricket Row: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మధ్య వార్ ముదురుతోంది. ఓ వైపు హెచ్సీఏ టీజీ20 పేర ప్రీమియర్ లీగ్ పోటీలను నిర్వహించటానికి సన్నాహాలు చేస్తుండగా దీనిని తక్షణమే నిలిపి వేయాలని టీసీఏ డిమాండ్ చేస్తోంది.
ఈ మేరకు టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి బీసీసీఐకి ఓ అలర్ట్ నోటీస్ పంపించారు. వెంటనే స్పందించని పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎన్నో ఆరోపణలు..
హెచ్సీఏపై పలు అవినీతి ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. క్రికెట్ బాళ్లు కొనటం మొదలుకుని ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేయించిన బకెట్ కుర్చీల వరకు ప్రతీ దాంట్లో హెచ్సీఏలో సభ్యులుగా ఉన్న కొందరు భారీగా అవినీతికి పాల్పడినట్టు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే హెచ్సీఏ అధ్యక్షునిగా పని చేసి జగన్మోహన్ రావుతోపాటు పలువురిని అరెస్ట్ చేశారు. తాజాగా హెచ్సీఏ అక్రమాలపై అదనపు పోలీస్ కమిషనర్ స్థాయి అధికారి ఇన్ ఛార్జ్ గా 'సిట్' ఏర్పాటు చేసి విచారణ జరిపించాలంటూ హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది.
హోరెత్తిన కేరళ వీధులు.. రాజకీయ వైరం మరిచి.. ఒక్కటైన ప్రత్యర్థి పార్టీలు!
ఇటువంటి పరిస్థితుల్లో..
ఇటువంటి పరిస్థితుల్లో హెచ్సీఏ టీజీ 20 ప్రీమియర్ పోటీలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. దీని కోసం గవర్నింగ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసింది. దీనిపై టీసీఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర స్థాయిలో క్రికెట్ ను అభివృద్ధి చేయటానికే ఈ పోటీలు అని చెబుతున్న హెచ్సీఏ మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని చెబుతోంది. రాష్ట్ర స్థాయిలో క్రికెట్ ను అభివృద్ధి చేయాలంటే జిల్లా స్థాయి కమిటీలు, మౌళిక సదుపాయాలు, క్రికెటర్ల నెట్ వర్క్ తప్పనిసరి అని పేర్కొంది. ఈ నెట్ వర్క్ హెచ్సీఏకు లేదని స్పష్టం చేస్తోంది. ఈ కారణంగానే గత 80ఏళ్లుగా హెచ్సీఏ జిల్లాల స్థాయిలో క్రికెట్ అభివృద్ధి కోసం ఏమీ చేయలదని అంటోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా నెట్ వర్క్ ఉండి పునాది స్థాయిలో క్రికెట్ వ్యవస్థను నడుపుతున్నది కేవలం టీసీఏ మాత్రమే అని చెబుతోంది.
నిబంధనలకు విరుద్ధం..
ఇటువంటి పరిస్థితుల్లో టీసీఏతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా హెచ్సీఏ టీజీ 20 ప్రీమియర్ లీగ్ ను ప్రకటించటం, ఫ్రాంచైజీల కోసం ఈఓఐ ప్రక్రియను ప్రారంభించటం, గవర్నింగ్ కౌన్సిల్ ను ప్రకటించటం బీసీసీఐ ఆదేశాలు, నిబంధనలకు విరుద్ధమని టీసీఏ చెబుతోంది. ముంబయి హైకోర్టులో తుది తీర్పు పెండింగ్ లో ఉన్న సమయంలో హెచ్సీఏ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం కోర్టు ధిక్కరణ అవుతుందని పేర్కొంది. బీసీసీఐ రాజ్యాంగంలోని రూల్ 28, 30, 31 ప్రకారం బీసీసీఐ ముందస్తు అనుమతి లేకుండా టోర్నమెంట్ నిర్వహించటం చట్ట విరుద్ధమని తెలిపింది. ఐపీఎల్ టోర్నీకి 15రోజుల ముందు 15రోజుల తరువాత ఉండే బఫర్ పీరియడ్ లో స్టేట్ లీగ్స్ నిర్వహించరాదన్న నిబంధనను కూడా హెచ్సీఏ ఉల్లంఘిస్తోందని పేర్కొంది. అనుమతి లేని ఇలాంటి టోర్నీల్లో పాల్గొంటే క్రికెటర్లు, కోచ్ లు, అంపైర్లు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గత పన్నెండేళ్లుగా టీసీఏ రాష్ట్రంలోని జిల్లాల్లో అభివృద్ధి చేసిన గ్రాస్ రూట్ క్రికెట్ వ్యవస్థను అక్రమంగా హస్తగతం చేసుకోవటానికే హెచ్సీఏ ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించింది. దీనిని అడ్డుకోవటానికి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టుగా ప్రకటించింది.

