Hero Flex-Fuel Bike Launch:ఇండియన్ టూవీలర్ మార్కెట్లో సరికొత్త కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. దేశంలోనే అతి పెద్ద మోటార్ సైకిల్ తయారీ సంస్థల్లో ఒకటైన హీరో మోటోకార్ప్ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ను విడుదల చేయబోతోంది.
జూన్ 3న ఈ బైక్ లాంచ్ కానుంది. పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ఆధారిత ఇంధనాన్ని ఉపయోగించే ఈ బైక్ దేశీయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.
కొత్త బైక్ ను లాంచ్ చేయనున్న కేంద్ర మంత్రులు
ఈ కొత్త బైక్ ను న్యూఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరీ ఆవిష్కరించనున్నారు. హీరో ఏ మోడల్ ను విడుదల చేయబోతోందన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించకపోయినా, స్ప్లెండర్ లేదంటే హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్లలో ఒకటి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ బైక్ ప్రత్యేకత ఏంటంటే?
ఈ బైక్ ప్రత్యేకత ఏమిటంటే.. E100 ఇంధనంతో పనిచేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్లు E85 ఇంధనాన్ని ఉపయోగిస్తాయి. అంటే, వాటిలో 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ ఉంటుంది. కానీ, హీరో కొత్త బైక్లో ఇథనాల్ శాతం మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది భారత మార్కెట్లో ప్రత్యేకమైన మోడల్గా నిలవనుంది. దేశంలో అందుబాటులో ఉన్న E100 పూర్తిగా స్వచ్ఛమైన ఇథనాల్ కాకపోయినా, దాదాపు 93 శాతానికి పైగా ఇథనాల్ ను కలిగి ఉంటుంది. మిగిలిన భాగంలో కొద్దిపాటి పెట్రోల్, ఇతర సంకలితాలు ఉంటాయి. దీంతో పెట్రోల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది.
ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడం అంత సులభం కాదు. ఇథనాల్ ఇంధనం పెట్రోల్తో పోలిస్తే భిన్నంగా ప్రవర్తిస్తుంది. అందుకే ఇంజిన్, ఫ్యూయల్ సిస్టమ్, స్టార్టింగ్ వ్యవస్థలో ప్రత్యేక మార్పులు చేయాల్సి వచ్చింది. హీరో జైపూర్లోని తన పరిశోధనా కేంద్రంలో ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. హీరో ఇప్పటికే హెచ్ఎఫ్ డీలక్స్, స్ప్లెండర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లకు అవసరమైన అనుమతులు పొందినట్లు సమాచారం. దీంతో విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో ఫ్లెక్స్ ఫ్యూయల్ హెచ్ఎఫ్ డీలక్స్ ను కంపెనీ ప్రదర్శించడంతో అదే మోడల్ ముందుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇథనాల్ ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
ఇక దేశంలో ఇథనాల్ ఇంధన వినియోగాన్ని ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. ఇండియన్ ఆయిల్ ఇప్పటికే E100 ఇంధనాన్ని కొన్ని ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 180కు పైగా కేంద్రాల్లో ఈ ఇంధనం లభిస్తోంది. పెట్రోల్ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం లాంటి ప్రయోజనాల కారణంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. హీరో మోటోకార్ప్ కొత్త బైక్ ఆ దిశగా ఓ కీలక ముందడుగు కానుంది.
Read Also: టెసరాక్ట్ విడుదల మరింత ఆలస్యం.. మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందంటే?

