ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఇది ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాల వేడుక సందర్బంగా ఏర్పాటు చేసిన సభ.
ఆయన ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఏ గూడెంలో కూడా గుడిసెలు లేకుండా, అందరికీ ఇండ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు అక్కడే ఉండి ఇవన్నీ పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఎన్ని కోట్లు ఖర్చైనా ఏడాదిలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని, గుడిసెలేని గూడేలాను తాను చూడాలని, దీని కోసం తల తాకట్టు పెట్టైనా నిధులు తెస్తానని ప్రకటించారు. ఆ తరువాతే ఆయన కీలకమైన సాగునీటి వనరులు, పంట కొనుగోళ్లపై మాట్లాడారు. తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి ఉంటే.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వీలుండేదని, కానీ దాన్ని మేడిగడ్డకు మార్చి లక్ష కోట్లు ఖర్చు చేసి.. ఆ లక్ష కోట్లను గోదారి పాలు చేశారని ఆయన విమర్శించారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తుమ్మిడి హట్టి వద్ద ప్రాణహిత- చేవెళ్లను నిర్మించేందుకు ఏడాదిగా ప్రయత్నిస్తున్నా.. అక్కడి సీఎం ఫడ్నవిస్ కనీసం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
దీని వెనుక కేసీఆర్ హస్తం ఉందని కూడా ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎందుకు ఇందులో జోక్యం చేసుకోవడం లేదని ఆయన ప్రశ్నించి.. దీనిపై మహారాష్ట్ర సీఎంతో మాట్లాడించేలా మధ్యవర్తిత్వం వహించాలని, లేదంటే మీ సీక్రెట్స్ బయటపెడతానని సీఎం వార్నింగ్ ఇవ్వడం చర్చకు తెరలేపింది. అంటే.. కేసీఆర్ దీన్ని వద్దంటున్నాడని, దీనికి కిషన్రెడ్డి కూడా వత్తాసు పలుకుతున్నాడని, అందుకే మహారాష్ట్ర సీఎం.. తమకు చర్చల కోసం ఆహ్వానం పంపడం లేదని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కిషన్రెడ్డిలు కలిసి కాంగ్రెస్ సర్కార్ను బద్నాం చేయాలనే ఉద్దేశంతో పాటు.. రైతులను గోస పుచ్చుకునే పనికి పూనుకున్నారని, మర్యాదగా కిషన్రెడ్డి .. వెంటనే మహారాష్ట్ర సీఎంతో మాట్లాడి.. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం కావాల్సిన 2 వేల ఎకరాల ముంపు భూమిని అప్పగించేలా చర్యలు తీసుకోవాలని, దీని పరిహారానికి ఎంత మొత్తమైనా చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.
పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన 7 గ్రామాలను, లక్షలాది మంది ప్రజలకు ఆంధ్రలో కలిపేసిన మోడీ.. తెలంగాణలోని నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్..లకు లక్షలాది ఎకరాలకు సాగునీరందించే తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారని.. ఇది కావాలనే చేస్తున్నారని సీఎం విమర్శించారు. అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల జల వివాదాలు సామరస్యంగా సీఎంలు పరిష్కరించుకోవాలని చెబుతూనే.. ఇక్కడ రహస్య మిత్రుడు కేసీఆర్ మాటను కాదనకుండా.. తమను ఇబ్బంది పెడతున్నారని, కనీసం పట్టించుకోవడం కూడా లేదని రేవంత్ అనడం చర్చనీయాంశమైంది.
పండించిన ప్రతీ పంటకు గిట్టుబాటు ధర ప్రకటించినామని చెబుతున్న కేంద్రం.. తెలంగాణలో పండించిన ధాన్యం, మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటలను ఎందుకు కొనుగోలు చేయడం లేదని నిలదీశారు రేవంత్. ఈ విషయంలో కూడా కిషన్రెడ్డిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు రేవంత్. వెంటనే ఈ వచ్చిన ధాన్యంతో పాటు అన్ని పంటలను కేంద్రం కొనుగోలు చేసేలా కిషన్రెడ్డి మాట్లాడకపోతే.. మధ్యవర్తిత్వం వహించకపోతే.. కిషన్రెడ్డి ఇంటి ముందు, ఆ పార్టీ ఆఫీసు ముందు ధాన్యం రాశులు పోసి ధర్నా చేస్తామని హెచ్చరించడం సమస్య తీవ్రతకు అద్దం పట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 80 శాతం ధాన్యం కొన్నామని, మరో 20 శాతం వరకు కొనేది ఉందని, అదంతా కొంటామన్నారు సీఎం.
తడిచిన ధాన్యాన్నీ కొంటామని, ఒకట్రెండు రోజులు లేట్ కావొచ్చేమో గానీ, ఏ రైతును ఇబ్బంది పెట్టబోమని, ధాన్యమంతా కొంటామని ఆయన రైతాంగానికి భరోసా నిచ్చారు. ఈ సభ ద్వారా ..కేంద్రం.. తెలంగాణకు సహాయ నిరాకరణ చేస్తుందనే విషయంతో పాటు.. తెర వెనుక విలన్గా కేసీఆర్ ఇదంతా చేపిస్తున్నాడని, రేవంత్ ప్రభుత్వం అన్నింటా విఫలమైందనే విధంగా జనం ముందుంచాలనే ఓ కుట్ర జరుగుతుందనే విధంగా సీఎం మాట్లాడటం రాజకీయంగా కలకలం రేపింది. దీంతో పాటు కిషన్రెడ్డి కూడా కేసీఆర్ మాటలు వింటున్నారని, వీరిద్దరి రహస్య బంధాన్ని, జిగిరీ దోస్తానాను త్వరలో బయటపెడతానని కూడా రేవంత్ అనడం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.
ఇది రైతుల పంటలకు, సాగునీటి ప్రాజెక్టుల అంశం కావడం…దీనికి బద్ద శత్రువులుగా కేసీఆర్, కిషన్రెడ్డిలే ఆటంకంగా నిలవడం.. దీన్ని స్వయంగా బహిరంగంగా సీఎం వెల్లడించడం తాజా రాజకీయ పరిణామాలను వేడెక్కించాయి. అటు రైతాంగంలో, ఇటు ప్రజానీకంలో కొత్త చర్చకు తెరతీశాయి.

