Iran Vs America: పశ్చిమాసియా పరిస్థితులు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ తన సైనిక చర్యను ముమ్మరం చేసింది. దీన్ని నిరసిస్తూ అమెరికాతో దౌత్యపరమైన చర్చలను ఇరాన్ రద్దు చేసుకుంది.
ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తస్నిమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. యుద్దం ముగించడానికి జరుగుతున్న ప్రయత్నాలు పూర్తిగా స్తంభించడంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు వార్తా సంస్థ వెల్లడించింది.
అమెరికాతో చర్చలపై ఇరాన్ షాకింగ్ నిర్ణయం
అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు రెండు అడుగులు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అన్నచందంగా తయారైంది. దాదాపు రెండునెలలుగా ఇరుదేశాలు చర్చలతో కాలయాపన చేస్తున్నారు. ఇరుదేశాలు ఒకరిపై మరొకరు బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా అలాంటి పరిస్థితి మరోసారి చోటు చేసుకుంది.
లెబనాన్పై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అమెరికాతో చర్చలను నిలిపి వేస్తున్నట్లు ఆదేశ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందానికి లెబనాన్ అంశం ముఖ్యమైన షరతు అని, ఆ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని పేర్కొంది.
మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?
మధ్యవర్తుల ద్వారా అమెరికాతో జరుపుతున్న చర్చలను ఇరాన్ బృందం తాత్కాలికంగా నిలిపివేస్తోందని ప్రస్తావించింది. ఇరాన్ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచదేశాలు ఒక్కసారిగా షాకయ్యాయి. అమెరికాతో చర్చలు నిలిపివేయడంతో ఇరాన్ తన మిత్రదేశాలతో హోర్మూజ్ జలసంధి పూర్తిగా స్తంభించి పోయేలా చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఎర్రసముద్రంలోని 'బాబ్ ఎల్ మండేబ్' జలసంధిని తమ అస్త్రాలుగా మార్చుకోవాలని ఆలోచన చేస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, దానికి మద్దతు ఇస్తున్న దేశాలను ఆర్థికంగా దెబ్బతీయాలని ఇరాన్ కూటమి ఆలోచనగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇరాన్ లో ఇంటిపోరు.. అధ్యక్షుడు మసూద్ నిర్ణయం వెనుక
లెబనాన్లో ఇజ్రాయెల్ ఆపరేషన్ తక్షణమే ఆపాలని, లేకుంటే మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చనే భయాలు నెలకున్నాయి. అదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణుల మాట.
అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ సోషల్ మీడియా వేదికగా అమెరికా-ఇజ్రాయెల్ దేశాలను ఆయన హెచ్చరించారు. లెబనాన్లో ఉద్రిక్తతలు పెంచడంతో కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. దీనివల్ల ఏర్పడే పరిణామాలకు ఆ రెండు దేశాలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

