Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి సీఎం డీకే శివకుమార్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన ఆయన తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చారు.
జాతీయ స్థాయి రాజకీయాల్లో తనకు ఆసక్తి లేదన్న సిద్దరామయ్య.. కర్ణాటక రాజకీయాలకే తాను పరిమితం అవుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగానే కొనసాగుతానని తేల్చి చెప్పారు. అందుకే రాజ్యసభకు వెళ్లమని హైకమాండ్ చేసిన సూచనను.. సున్నితంగా తిరస్కరించినట్లు తెలియజేశారు.
కాంగ్రెస్ హైకమాండ్ డీకే శివకుమార్ ను కర్ణాటక తదుపరి సీఎంగా ప్రతిపాదించినట్లు సిద్దరామయ్య తెలిపారు. ఇందుకు తాను అంగీకరించినట్లు చెప్పారు. ‘రాజ్యసభకు వెళ్లమని హైకమాండ్ నాకు చెప్పింది. కానీ నేను దానికి వద్దు అని సమాధానం ఇచ్చాను. నాకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు. నేను క్రియాశీలక రాజకీయాల్లోనే ఉంటాను’ అని మీడియా సమావేశంలో సిద్దరామయ్య చెప్పుకొచ్చారు.
అధిష్టానం ఆదేశాల మేరకే తాను సీఎం పదవికి రాజీనామా చేసినట్లు సిద్దరామయ్య మరోమారు పునరుద్ఘటించారు. అధిష్టానం సూచనలను తాను శిరసా వహించినట్లు చెప్పారు. తన రాజీనామాను గవర్నర్ ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. డీకే శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని వ్యాఖ్యానించారు. కొత్త సీఎం నియామకానికి తాను మార్గం సుగమం చేశానన్న ఆయన.. ఇన్నాళ్లు తనకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు. అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు సైతం సిద్దరామయ్య కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదిలా ఉంటే గత ఏడాది కాలంగా డీకే శివకుమార్ సీఎం సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సిద్దరామయ్య పదవి నుంచి దిగిపోయేందుకు సముఖత వ్యక్తం చేయలేదన్న వార్తలు జాతీయ మీడియా వచ్చాయి. పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు ఎన్నికలు ఉండటంతో సీఎం సీటు మార్పుపై హైకమాండ్ సైతం పెద్దగా ఫోకస్ పెట్టలేకపోయింది. అయితే ప్రస్తుతం కేరళ, తమిళనాడులో కాంగ్రెస్ భాగస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు కావడంతో.. హైకమాండ్ దృష్టి తిరిగి కర్ణాటక వైపునకు మళ్లింది.
జియో vs ఎయిర్టెల్.. ఒకే ధరతో రూ.3,999 వార్షిక ప్లాన్స్.. రెండింటిలో ఏది బెస్ట్?
ఈ క్రమంలోనే మంగళవారం సిద్దరామయ్యతో రాహుల్ గాంధీ 35 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించారు. తదుపరి సీఎంగా డీకే శివకుమార్ కు అవకాశం కల్పించాలని రాహుల్ సూచించారు. త్వరలో ఖాళీ కాబోయే 3 రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఇస్తానని ఆయన హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్ సభ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాహుల్ ఆదేశించినట్లు కూడా కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సిద్దరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేయక తప్పలేదని తెలుస్తోంది.

