కేటీఆర్ మాట్లాడే తీరులో.. ప్రసంగంలో ఎక్కడో ఒకచోట జనాన్ని దోషులుగా ధ్రువీకరించే పనిని ఎత్తుకోవడం కామన్ అయింది. ప్రజా తీర్పును కించపరిచే విధంగా మాట్లాడే విధానం అలవాటు కూడా అయ్యింది.
కేసీఆర్ అదే అంటున్నాడు. కేసీయారు అదే అంటున్నాడు. సభ ఏదైనా, సమావేశం మరేదైనా.. సందర్భం ఇంకేదైనా. కాంగ్రెస్ను తిట్టాలనుకుంటే తిట్టు. సర్కార్ను నిలదీయాలనుకుంటే నిలదీయు. ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాలంటే పోరాడు. జనం మద్దతు కూడగట్టుకో. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే సాధించుకోండి.
జనం ఏ విషయాల్లో చీదరించుకున్నారో వాటి విషయాల్లో పరవర్తన చెందండి. నమ్మకాన్ని చూరగొనండి. కానీ కేసీఆర్ అయినా.. కేటీఆర్ అయినా.. జనం తమను ఓడగొట్టి పెద్ద తప్పు చేశారనే విధంగా.. కాంగ్రెస్ను గెలిపించి నేరం చేశారనే విధంగానే మాట్లాడుతున్నారు. చెప్పినా వినలేదు. ఆశ పడ్డారు. ఆగమైండ్రు. చిలుకకు చెప్పినట్టు చెప్పినం.. ఈ పదాలు తరచూ తండ్రీకొడుకుల నోటి నుంచి వస్తూనే ఉన్నాయి. తాజాగా రైతు సంగ్రామ సభలో కూడా దొంగలకు సద్దులు కట్టారు.. అని జనాన్ని తిట్టాడు కేటీఆర్. అంటే కాంగ్రెస్ను గెలపించారని ఆయన బాధ. మరి పదేండ్లు బీఆరెస్ను ఈ జనమే కదా గెలిపించింది? అప్పుడూ దొంగలకు సద్దులు కట్టినట్టేనా? ప్రధాన ప్రతిపక్షంగా తాము చేయాల్సిన పనులు చేయకుండా..
కచ్చితంగా రోజుకోసారి జనాన్ని తిట్టకపోతే.. విమర్శించకపోతే.. దోషిగా నిలబెట్టకపోతే.. అనుభవిస్తున్నారు.. మంచిగైందనే పైశాచికత్వం.. ప్రకోపం చూపించకపోతే మనసు చల్లబడేలా లేదు ఇద్దరికీ. సరే, ప్రధాన ప్రతిపక్షం మీరే. ఇప్పుడున్న సర్కార్ మీద వ్యతిరేకత పెరిగిందనుకుందాం. జనాలకు తిక్కరేగిందనుకుందాం. బండకేసి కొడతారు. ఆ సమయం కోసమైనా వేచి చూడండి. ఓపిక పట్టండి. పోరాటాలు చేయండి. జనంతో కలిసి నడవండి. లోపలున్నది ఇలా బాహాటంగా బహిరంగ వేదికల మీద బయటకు కక్కేయడమెందుకు? అంటే .. నమ్మకం లేదా? జనం మీద.. జనం మిమ్మల్ని నమ్మడం లేదనే అనుమానమేమైనా ఉందా? మరోసారి ఇలా చేయొద్దని వార్నింగిస్తున్నారా? ఇది కాదు కదా చేయాల్సింది. ప్రధాన ప్రతిపక్షంగా మెలగాల్సింది ఇలా కాదు కదా కేటీఆర్.. ! ఇంకో మటన్నాడు. ఈ తెలంగాణ గడ్డ నియంతలను ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతుందని.
అది సరిగ్గా మీకే నప్పుతుంది. కేసీఆర్ పాలనను తిరస్కరించి ఫామ్హౌజ్కు పరిమితం చేయడం కూడా ఇందులో భాగమే అవుతుంది కదా. దీన్ని కెలికి మరీ గుర్తు చేసుకోవడమెందుకు? సర్కార్ తప్పులను ఎండగట్టండి. పలాయనవాదం మీద పోరాడండి.. నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేయండి.. ప్రజలను తప్పుబట్టడం.. ప్రజాతీర్పును కించపరచడం.. రేపు మీరు అధికారంలోకి వస్తే.. అప్పుడు జనం కరెక్టేనన్నట్టు. భేష్ అని పొగడాలన్నట్టు. రెగ్యులర్ సీఎం.. రెన్యూవల్ సీఎం అనే పదాలు వాడిండు కేటీఆర్ ఈ సభలో. రెగ్యులర్ సీఎం ఎవరూ ఉండరు. మారుతూ ఉంటారు. కేసీఆర్ అనుకున్నాడా? తాను గద్దె దిగుతానని. అనుకున్నాడు… ఎప్పుడు..? తాను గద్దె దిగి ఆ వెంటనే నిన్ను గద్దె ఎక్కిద్దామని. అంటే రెగ్యూలర్ సీఎంలు మీరే అన్నట్టు తెలంగాణకు. తెలంగాణ కేసీఆర్, కేటీఆర్ పేటెంటు. ఇది గ్రహించాలి జనం. అంతేగా కేటీఆర్..!

