కమ్యూనిస్టుల కోటకు బద్దలు కొట్టి కేరళంలో కాంగ్రెస్ విజయతీరాలకు చేరింది. అవినీతి, బంధు ప్రీతి అక్కడ ఎల్డీఎఫ్కు తీవ్ర ప్రతికూలంగా మారింది. పినరయి విజయన్..
పాలన, ఆయన నిర్ణయాలపై అక్కడ తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోగా.. తనకు తిరుగులేదనే అహం అక్కడి పాలకుడిలో వచ్చిందనే ప్రచారం గత కొంతకాలంగా తీవ్రమైంది. ఇది యూడీఎఫ్ కూటమికి కలిసి వచ్చింది. ఇప్పుడు స్ఫష్టమైన మెజారిటీతో కేరళం హస్తగతమైంది. ఈ విజయం జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు మంచి ఊపునిచ్చింది.
దీనికి తోడు ఈ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి .. రెండు, మూడు పర్యాయాలు వెళ్లి రావడం.. అక్కడి సీఎంతో… లేఖలు సంధించుకోవడం.. ఇవన్నీ చర్చకు వచ్చాయి. అంతిమంగా ఇక్కడి రాజకీయంతో పినరయి కెలుక్కోవడం.. ఆయనకు మైలేజీని తేవడమోమో గానీ నష్టాన్ని మిగిల్చిందనే చెప్పాలి. అంతిమంగా అన్ని సమీకరణలు కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా మారి.. యూడీఎఫ్ బ్రహ్మాండమైన విజయాన్నే కైవసం చేసుకున్నది. ఇప్పుడు అక్కడ సీఎం ఎవరనే చర్చ మొదలైంది. కేసీ వేణుగోపాల్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. ఆయన కనీసం అక్కడ పోటీ చేయలేదు. మరి ఆయన ఎలా సీఎం అవుతారు? అనే విషయంలో కూడ చర్చ మొదలైంది. కానీ అధిష్టానంతో ఆయన అత్యంత సన్నిహితంగా ఉన్న కీలమైన నేతగా గుర్తింపు పొందారు.
ఏఐసీసీలో టాప్ లెవల్ లీడర్. రాష్ట్రాల రాజకీయాలను సమన్వయం చేసుకుని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే వ్యూహకర్తల్లో ఈయన టాప్లో ఉంటారు. సోనియా, రాహుల్, ఖర్గే.. వీరందరికీ నమ్మిన బంటు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చూసుకోవడం, చక్కదిద్దడంలో దిట్ట. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న కేసీ వేణుగోపాల్కు కేరళ సీఎం ఇస్తారా? అసలు లోకల్ క్యాడర్ ఏమనుకుంటున్నారు? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వీడీ సతీషన్, రమేశ్ చెన్నితల…వీరిద్దరు ప్రధానంగా సీఎం రేసులో ఉన్నారు. లోకల్గా ఉన్నవారే సీఎం కావాలనే వాదన తెరపైకి బలంగా వస్తే.. వీరిద్దరిలో ఒకరి చాన్సు రానుంది. కానీ అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో.. కేసీ వేణుగోపాల్ పేరు తెరపైకి బలంగా వచ్చింది.
ఆయనకు కూడా సీఎంగా చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా అత్యంత సమీపంగా ఉన్న నేతల నుంచి ప్రచారం కూడా అక్కడ మొదలైంది. దీంతో ఇప్పుడు సీఎం రేసు బరిలో ఉన్న వీడీ సతీషన్, రమేశ్ చెన్నితల .. వీరిద్దరికి మంచి మంత్రి వర్గంలో సముచిత ప్రాధాన్యతనిస్తారని భావిస్తున్నారు. కేసీ వేణుగోపాల్ సీఎంగా ఉంటే..ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు మరింత పదునైన వ్యూహాలు అమలు చేయొచ్చనే వాదనా ఉంది. తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిని కూడా ఏఐసీసీ పలు కీలక పార్టీ వ్యవహారాల్లో భాగస్వామ్యం చేస్తోంది.
ఏఐసీసీలో కూడా కీలక పదవి దక్కుతుందనే ప్రచారం ఊపందుకున్నది. ఈక్రమంలో సీనియర్, ఎంతో అనుభవం ఉండి.. జాతీయ రాజకీయాల్లో అపారమైన పట్టున్న కేసీ వేణుగోపాల్ కేరళకు సీఎం చేయడం వల్ల ఆ రాష్ట్రానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని అక్కడి పార్టీ నేతలు భావిస్తున్నారు. కష్టపడ్డ కార్యకర్తలకు, నేతలకు సముచిత ప్రాధాన్యతా దక్కుతుందని ఆశిస్తున్నారు. అధిష్టానం కేసీ వేణుగోపాల్ పేరును ప్రతిపాదిస్తే.. దాన్ని ఆమోదించేందుకు అంతా రెడీగా ఉన్నారు. కానీ దీనిపై అధిష్టానం ఇంకా సస్పెన్స్నే కొనసాగిస్తోంది.

