Gajjela Kantham: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ నాయకురాలు గజ్జెల కాంతం గాంధీ భవన్ వేదికగా బీఆర్ఎస్ (BRS) అగ్రనాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల వైఖరిని ఎండగడుతూ ఆమె చేసిన సంచలన వ్యాఖ్యల రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలన సృష్టించాయి.
పాలేరు పాలన.. మిలిటెంట్ రాజకీయాలు
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పెద్ద పాలేరులా, కేటీఆర్ చిన్న పాలేరులా వ్యవహరిస్తున్నారని గజ్జెల కాంతం ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ కాదని, అదొక మిలిటెంట్ వ్యవస్థ అని విమర్శించారు. కొడంగల్లో ఐఏఎస్ అధికారులపై జరిగిన దాడే దీనికి ప్రత్యక్ష నిదర్శనమని, అధికారం లేకపోతే రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని వారు చూస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు.
సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లపై ఫైర్
మాజీ ఎంపీ బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ల అసలు స్వరూపం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. దళిత, అణగారిన వర్గాలను పూర్తిగా మోసం చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరారని ఆరోపించారు. ఇక బాల్క సుమన్ కేసీఆర్ ఇంట్లో పాలేరు పని చేసి పైకి వచ్చాడని, చదువుకున్న వ్యక్తి అయి ఉండి, ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసినా కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. సుమన్ వెనుక ఉండి నడిపిస్తోంది కేటీఆర్, హరీష్ రావులేనని స్పష్టం చేశారు.
పదేళ్ల అక్రమాలు.. హెచ్చరికలు
గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విపరీతంగా అక్రమాలు జరిగాయని, మీడియా సంస్థలపై ఆంక్షలు విధించడమే కాకుండా కనీసం నిరసన తెలిపే హక్కును కూడా కాలరాశారని కాంతం గుర్తుచేశారు. ఇప్పుడు వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో విధ్వంసం సృష్టించేందుకు కేటీఆర్, హరీష్ రావులు దుర్మార్గపు ప్రణాళికలు వేస్తున్నారని, ప్రజలను ప్రశాంతంగా నిద్రపోకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అకృత్యాలను చూస్తూ ఊరుకోబోమని, ఒకవేళ ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తే కేటీఆర్, హరీష్ రావుల ఇళ్లను, ఫామ్హౌస్లను ముట్టడిస్తామని గజ్జెల కాంతం హెచ్చరించారు.

