Vemula Veeresham: నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్లో చేసిన వ్యాఖ్యలను వీరేశం తనదైన శైలిలో తిప్పికొట్టారు. అసలు కేటీఆర్కు సంస్కారం ఉందా అని ప్రశ్నిస్తూనే, ఆయన భాషపై నిప్పులు చెరిగారు.
ముఖ్యంగా కేటీఆర్ తీరును విమర్శిస్తూ.. 'కేటీఆర్కు అహంకారం, కొవ్వు పెరిగి మాట్లాడుతున్నాడు. తెలంగాణను గంజాయి రాష్ట్రంగా మార్చిన ఘనత ఆయనదే. సిగ్గు, శరం లేకుండా కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల పాలనలో తెలంగాణ ఉద్యమకారులను డీటీసీ (DTC) కి పంపించి కొట్టించిన చరిత్ర మీది కాదా అని వీరేశం సూటిగా ప్రశ్నించారు. ప్రజలు గత ఎన్నికల్లోనే తగిన బుద్ధి చెప్పినా, కేటీఆర్లో అహంకారం మాత్రం అణుమాత్రం కూడా తగ్గలేదని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం రైతుల కోసం రుణమాఫీ వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుంటే, ప్రజలను తప్పుదారి పట్టించడానికి కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని వీరేశం మండిపడ్డారు. పదేళ్లలో విద్యార్థులను, నిరుద్యోగులను నట్టేట ముంచిన వారు నేడు నైతికత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద చర్చించే ధైర్యం లేక, కేవలం మైకుల ముందు ఇష్టం వచ్చినట్టు తిడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అమరవీరుల త్యాగాల మీద గద్దెనెక్కిన వారు నేడు అదే ఉద్యమ గడ్డ వరంగల్లో అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటని వీరేశం తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ తన భాషను మార్చుకోకపోతే ప్రజలే భవిష్యత్తులో మరిన్ని గుణపాఠాలు చెబుతారని ఆయన హెచ్చరించారు.

