Railway Koduru: రైల్వే కోడూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలుపల్లి చెక్ పోస్ట్ వద్ద పట్టపగలే నడిరోడ్డుపై మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని, మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి.
ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఒక ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఇన్నోవా కారును మరో కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, చూస్తుండగానే మూడు వాహనాలు అగ్నికీలల్లో చిక్కుకుని పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కాపాడి, మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంతో రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

