పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపునకు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మే 4న కౌంటింగ్ జరగాల్సి ఉండగా..
ఎన్నికల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తృణమూల్ కాంగ్రెస్ (TMC) విడుదల చేసిన ఒక వీడియో కలకలం రేపుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కై ఎన్నికల ఫ్రాడ్కు పాల్పడుతున్నాయని మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ ఆరోపించింది
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా టీఎంసీ షేర్ చేసిన సీసీటీవీ ఫుటేజీలో.. ఏ పార్టీ ప్రతినిధులు లేకుండానే బ్యాలెట్ బాక్సులను తెరుస్తున్న దృశ్యాలు ఉన్నాయని ఆ పార్టీ పేర్కొంది. ఓటర్ల పేర్ల తొలగింపు, బెదిరింపుల నుంచి ఇప్పుడు ఏకంగా ఈవీఎంల ట్యాంపరింగ్ వరకు బీజేపీ బరితెగించిందని టీఎంసీ నేతలు మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియం వెలుపల టీఎంసీ సీనియర్ నాయకులు శశి పంజా, కునాల్ ఘోష్ ధర్నాకు దిగారు.
మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మమతా బెనర్జీ తీవ్రంగా తోసిపుచ్చారు. టీఎంసీ ఒంటరిగానే 226 కంటే ఎక్కువ సీట్లు సాధించి ఘనవిజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కేవలం తమ కార్యకర్తల నైతిక ధైర్యాన్ని దెబ్బతీసేందుకే బీజేపీ మీడియా మేనేజ్మెంట్ చేస్తోందని ఆరోపించారు. గత 2021 ఎన్నికల్లో కూడా ఇలాంటి అంచనాలే వచ్చాయని.. కానీ ఫలితాలు భిన్నంగా ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ కేంద్రాల వద్ద 24 గంటల పాటు నిఘా ఉంచాలని, ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ హాల్స్కు తరలించే సమయంలో యంత్రాలను మార్చే కుట్ర జరిగే అవకాశం ఉందని ఆమె కార్యకర్తలను హెచ్చరించారు.
“నేనే స్వయంగా భవానీపూర్ కౌంటింగ్ కేంద్రం వద్ద కాపలా ఉంటాను.. మీరు కూడా మీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి.” అని దీదీ పిలుపునిచ్చారు. మీడియా నెరేటివ్లను నమ్మవద్దని.. ఫలితాల రోజున అసలు నిజం బయటపడుతుందని ఆమె స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ.. టీఎంసీ చేస్తున్న ఈ తాజా ఆరోపణలు బెంగాల్ రాజకీయాల్లో ఉత్కంఠను పతాక స్థాయికి చేర్చాయి.

