Hyderabad: ఎండలు మండిపోతున్న వేళ, కాప్రాలో జరిగిన ఒక విషాద ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. ఒక చిన్న నిర్లక్ష్యం ఎంతటి ఘోరానికి దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ.
కుషాయిగూడ ఇన్స్పెక్టర్ ఎల్. భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎల్ రావు నగర్లో నివసించే బచ్చు కృష్ణ (54) అనే వ్యాపారికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. బుధవారం రాత్రి ఆయన ఇంటి బాల్కనీ కిటికీకి అమర్చి ఉన్న ఐరన్ ఫ్రేమ్ ఎయిర్ కూలర్లో నీళ్లు నింపడానికి వెళ్లారు. అయితే, కూలర్ ఆన్లో ఉండగానే, కరెంట్ కనెక్షన్ కూడా తీయకుండా ఆయన నీళ్లు పోసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి (షార్ట్ సర్క్యూట్) గురై కృష్ణ కింద పడిపోయారు.
అది గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళనతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కరెంట్ వస్తువులతో వ్యవహరించేటప్పుడు ప్లగ్ తొలగించాలనే చిన్న విషయాన్ని మరువడంతో ఒక నిండు ప్రాణం బలికావడం స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపింది.

