Dailyhunt

మక్కికి మక్కీ.. తండ్రిని కాపీ..! కవిత రాజకీయం కూడా మోతె గ్రామంతో మొదలు..

Big TV Live 6 days ago

కేసీఆర్ మారిన మనిషి అని విమర్శించిన కవిత.. ఆయన మారని టైంలో.. అంటే పాత కేసీఆర్‌గా చేసిన పనులు.. జనాలు ఆదరించిన విధానాలు.. పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు అనుసరించిన విధానాలు మాత్రం పాలో అవుతున్నారు.

మారిన మనిషి కాబట్టి.. మారిన తరువాత ఆయన తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. పాలనలో లోపాలను ఎత్తి చూపుతున్నారు. అంతేగానీ గుడ్డిగా కేసీఆర్‌నే వ్యతిరేకించడం లేదామె. రాజకీయ వ్యూహాలు, ప్రసంగాలు, జనాల నాడి తెలుసుకుని మసలుకునే విధానాలు.. ఆయన నుంచి వడిసి పట్టుకునేందుకు ఆమె ఏ మాత్రం సంకోచించడం లేదు.

ఆమె చాలా నేర్చుకోవాల్సి ఉంది. అనుసరించాల్సి ఉంది. పాటించాల్సి కూడా ఉంది. ఈ కొత్త రాజకీయ ప్రయాణంలో సక్సెస్ లీడర్లను స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే ఆమె .. తన తండ్రి తొలత రాజకీయాలనే ఫాలో అవుతున్నట్టే కనిపిస్తున్నది. ఎందుకంటే.. ఆమె పార్టీ పేరునే టీఆరెస్‌గా వచ్చేలా రాజకీయ వ్యూహాలు పన్ని మరీ దక్కించుకున్నారు. ఇక తన పాంచజన్యం పేరుతో ఇచ్చిన ఐదు కీలక హామీలు, కీలకమే కాదు.. సాహసోపేతమైన హామీలు.. అమలుపరిచే క్రమంలో జనం నమ్మకాన్ని చూరగొనేందుకు ఆమె తండ్రి వాడిన మోస్ట్ పాపులర్ పొలిటికల్ కామెంట్‌… మాట తప్పితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి..! అని. దీన్ని కూడా ఆమె సందర్భానుసారం .. ప్రస్తుత తన రాజకీయ పరిస్థితులకు కరెక్టుగా సెట్ అయ్యేలా వాడుకున్నారు. మళ్లీ అప్పటి కేసీఆర్‌ను యాదికి తెచ్చారు.

మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదేందుకు.. కేసీఆర్ ఆనాడు పాటించిన రాజకీయ వ్యూహాలు, కామెంట్లు ఆమె ఇప్పుడు తన పార్టీ కోసం, తన కోసం వినియోగించుకుంటున్నారు. ఇక తాజాగా ఆమె ఇవాళ సాయంత్రం సిద్ధిపేట జిల్లా భూంపల్లి – అక్బర్ పేట మండలం మోతె గ్రామంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో టీఆర్ఎస్ పార్టీ జెండా, కండువాకు పూజలు చేశారు. ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. మోతె అనే గ్రామం పేరు. మోతె గ్రామం ద్వారానే కేసీఆర్ ఆనాడు తొలి అడుగు వేశాడు. కానీ అది ఈ మోతె కాదు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతె గ్రామంలో తెలంగాణ ఏర్పాటు కోసం ఆ ఊరి మట్టిని ముడుపుకట్టుకున్నాడు కేసీఆర్‌. తెలంగాణ వచ్చిన తరవాతే ఆ ముడుపును విప్పుతానని ఆ మోతె గ్రామం సాక్షిగా, అక్కడి ప్రజానికం తోడు రాగా శపథం పూనాడు.

ఆనాడు ఆయన వెంట గుప్పెడు మంది లేరు. ఆయన పార్టీ కి పెద్దగా సపోర్టు కూడా దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లో మోతె గ్రామంలో ఆయన ముడుపు కట్టిన ఆ రాజకీయ చర్యకు అద్భుతమైన ప్రభావం పడింది. అంతా కేసీఆర్ వంక చూడటం ఆరంభించారు. ఆయన కమిట్‌మెంట్‌లో భాగంగా రాజకీయంగా చేస్తున్న ఒక్కో చర్యలో మోతె కీలకమనే చెప్పాలి. అది అందరిలో సెంటిమెంట్‌ను రాజేసింది ఆనాడు. ఇప్పుడు అలాంటి సెంటిమెంట్లు.. శపథాలు ఏమీ పనిచేయవు.. కానీ కవిత మాత్రం తను రాజకీయంగా పార్టీ స్థాపించి ఇక ప్రజల్లోకి వెళ్లే క్రమంలో తొలిసారిగా పార్టీ జెండా, కండువాకు పూజలు చేయడం ఓ సెంటిమెంట్‌గా తీసుకున్నారు. అందులోనూ తండ్రి ఎంచుకున్న మోతె పేరుతో వచ్చే గ్రామాన్నే ఆమె ఎంచుకోవడం కాకతాళీయమేమీ కాదు. తన సెంటిమెంట్‌లో అదీ ఓ భాగమే. ఆనాడు తండ్రి వేసిన ప్రతీ అడుగు సక్సెస్‌కు బాటలు వేసింది. ఇప్పుడు కవిత వేసే ప్రతి అడుగు తండ్రి చూపిన బాటనే అనుసరిస్తున్నది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live