Horror Thriller Series on OTT : ఓటీటీలో ఒక గూస్బంప్స్ తెప్పించే హారర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది 1845లో ఆర్కిటిక్ మహాసముద్రంలో బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన రెండు నౌకలు, అందులో ఉన్న సిబ్బంది అదృశ్యమైన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన సిరీస్.
కొత్త సముద్ర మార్గాన్ని కనుగొనే క్రమంలో రెండు నౌకలు విపరీతమైన గడ్డకట్టే మంచు మధ్య చిక్కుకుపోతాయి. నౌకల్లోని ఆహారం అయిపోవడం, మైనస్ డిగ్రీల చలిలో ఈ సిరీస్ నడుస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ విజువల్స్ ఇందులో ఉన్నాయి. డార్క్ సస్పెన్స్ కథలు ఇష్టపడే వాళ్ళు ఈ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వకూడదు.
ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
హారర్ థ్రిల్లర్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ది టెర్రర్’ (The Terror). ఈ సిరీస్ మొదటి సీజన్ 1845లో జరిగిన సర్ జాన్ ఫ్రాంక్లిన్ ఆర్కిటిక్ యాత్ర ఆధారంగా తెరకెక్కింది. కొన్ని వందల ఏళ్లపాటు మిస్టరీగా మిగిలిపోయిన ఆ నౌకల శిథిలాలు నిజంగానే 2014లో కెనడా సముద్ర తీరంలో దొరకడం విశేషం. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ రిడ్లీ స్కాట్ (గ్లాడియేటర్, ఏలియన్ ఫేమ్) దీనికి నిర్మాతగా వ్యవహరించగా, జారెడ్ హారిస్, తోబియాస్ మెంజీస్ వంటి నటులు తమ అద్భుతమైన నటనతో ప్రాణం పోశారు. మైనస్ డిగ్రీల చలి, మంచు తుఫానులను కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమాటోగ్రఫీకి ప్రపంచవ్యాప్తంగా అవార్డులతో పాటు ప్రశంసలు కూడా దక్కాయి. ఈ సిరీస్ ఒక ఆంథాలజీ ఫార్మాట్లో సాగుతుంది. 2018 లో వచ్చిన ఈ సిరీస్ మొత్తం మూడు సీజన్లతో ప్రేక్షకులను అలరించింది. భారీ రేటింగులు సాధించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళ్తే
1845లో బ్రిటీష్ రాయల్ నేవీకి చెందిన 'HMS ఎరెబస్', 'HMS టెర్రర్' అనే రెండు పెద్ద నౌకల ప్రయాణంతో స్టార్ట్ అవుతుంది ఈ కథ. ఆర్కిటిక్ సముద్రం గుండా కొత్త దారిని కనుక్కోవడానికి కెప్టెన్ జాన్ ఫ్రాంక్లిన్ లీడర్షిప్లో 129 మంది సిబ్బంది బయలుదేరుతారు. అయితే ఊహించని విధంగా అక్కడ విపరీతమైన మంచు కురిసి, ఆ రెండు నౌకలు కదల్లేని విధంగా ఐస్లో పూర్తిగా ఇరుక్కుపోతాయి. సంవత్సరాలు గడుస్తున్నా మంచు కరగకపోవడంతో, తిండి అయిపోవడం, చలి తట్టుకోలేక కెప్టెన్ ఫ్రాంక్లిన్ చనిపోతాడు. ఆ తర్వాత కెప్టెన్ ఫ్రాన్సిస్ క్రోజియర్ బాధ్యతలు తీసుకుంటాడు. ఒకవైపు గడ్డకట్టే చలి, డబ్బాల్లో తెచ్చుకున్న ఫుడ్ పాడైపోయి రోగాలు రావడం లాంటి సమస్యలతో నావికులు చనిపోతుంటే, మరోవైపు ఆ మంచు కొండల్లో తిరిగే 'తున్బాక్' అనే ఒక వింత రాక్షస మృగం వాళ్లపై ఎటాక్ చేస్తూ ఒక్కొక్కరిని చంపేస్తుంటుంది.
ఇక అక్కడ ఉంటే మొత్తం చచ్చిపోతామని ఫిక్స్ అయి, నౌకలను వదిలేసి మంచుపై నడుచుకుంటూ ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలని కెప్టెన్ క్రోజియర్ ప్లాన్ చేస్తాడు. ఈ సమయంలో హిక్కీ అనే ఒక దుర్మార్గుడు కొంతమంది నావికులను తనవైపు తిప్పుకుని కెప్టెన్పైనే తిరుగుబాటు చేస్తాడు. ఆకలి తట్టుకోలేక చనిపోయిన తోటి నావికుల శవాలనే తినే దారుణమైన స్థితికి వాళ్లు వచ్చేస్తారు. చివరకు హిక్కీ గ్యాంగ్ మొత్తం ఆ రాక్షస మృగానికి బలైపోతుంది. ఈ పోరాటంలో ఆ మృగం కూడా చనిపోతుంది. అందరిలో కెప్టెన్ క్రోజియర్ ఒక్కడే ప్రాణాలతో మిగిలి, మళ్లీ తన దేశానికి వెళ్లకుండా అక్కడే ఉండే స్థానిక ఎస్కిమో తెగ ప్రజలతో కలిసి జీవించడంతో ఈ సాడ్ స్టోరీ ఎండ్ అవుతుంది.

