Farmhouse Murders: స్వేచ్ఛ బ్యూరో: మొయినాబాద్ ఫార్మ్ హౌస్ జంట హత్యల కేసులో సంచలన వివరాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడ్డ కీలక సూత్రధారి అయిన మహిళ మొత్తం 8మందిని టార్గెట్ గా చేసినట్టు బయట పడింది.
వీరిలో ఇద్దరిని పథకం ప్రకారం మొయినాబాద్ ఫార్మ్ హౌస్ కు పిలిపించి భర్త, బంధువుతో కలిసి దారుణంగా హత్య చేయటం గమనార్హం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీ వాస్తవ్యులైన ఆబేదా బేగం, మహబూబాబీ తెలిసిన వారికి వడ్డీకి డబ్బు అప్పుగా ఇస్తుంటారు. ఇక, ఇందిరమ్మ కాలనీలోనే ఉంటున్న భార్యాభర్తలు కరీమా బేగం, రెహమాన్, వీరి బంధువు నయీంతో వీరికి పరిచయాలు ఉన్నాయి.
కుట్ర ప్రకారం ముందుగా..
ఈ క్రమంలో కొంతకాలం క్రితం ముగ్గురికి భారీ మొత్తాల్లో డబ్బు అప్పుగా ఇచ్చారు. మొదట్లో రెండు మూడు నెలలు వడ్డీ సరిగ్గానే చెల్లించిన కరీమా బేగం, రెహమాన్, నయీంలు ఆ తరువాత ఎగ్గొట్టటం మొదలు పెట్టారు. దాంతో తీసుకున్న డబ్బును వాపస్ చేయాలంటూ ఆబేదా బేగం, మహబూబాబీ వీరిపై ఒత్తిడి తీసుకు రావటం మొదలు పెట్టారు. దాంతో కరీమా బేగం, రెహమాన్, నయీం కలిసి ఈ ఇద్దరిని హతమార్చాలని కుట్ర చేశారు. చంపేస్తే డబ్బు తిరిగి ఇచ్చే సమస్య ఉండదనుకున్నారు. పకడ్భంధీగా చేసిన కుట్ర ప్రకారం ముందుగా మహబూబాబీని డబ్బు ఇచ్చేస్తామని నమ్మించి మొయినాబాద్ లోని తోల్ కట్ట ఫార్మ్ హౌస్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి మహబూబాబీ గొంతు నులిమి హత్య చేశారు. ఆ తరువాత అక్కడే గొయ్యి తీసి మృతదేహాన్ని పాతి పెట్టారు. ఆ తరువాత ఆబేదా బేగంను కూడా అదే ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి పూడ్చేశారు. కాగా, కనిపించకుండా పోవటంతో మహబూబాబీ, ఆబేదా బేగంల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also read: బీఆరెస్లో టీఆరెస్ కలవరం! పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల కోసం కవితకు పోటీగా బీఆరెస్ పాదయాత్ర!
తోల్ కట్ట ప్రాంతానికి..
ఈ మేరకు కేసులు నమోదు చేసిన తాండూరు రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి, బషీరాబాద్, చేవెళ్ల, మొయినాబాద్ పోలీసులతో కలిసి విచారణ ప్రారంభించారు. హత్యకు గురైన మహబూబాబీ, ఆబేదా బేగం మొబైల్ ఫోన్ల సిగ్నళ్లను ట్రాక్ చెయ్యగా చివరకు వాళ్లు తోల్ కట్ట ప్రాంతానికి వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో తాండూరు నుంచి మొయినాబాద్ వరకు ఉన్న దాదాపు 250 సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించిన పోలీసులు దానిని విశ్లేషించారు. ఈ క్రమంలో కరీమా బేగం, రెహమాన్, నయీంలను గుర్తించారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. తోల్ కట్ట ప్రాంతానికి నిందితులను తీసుకొచ్చి తవ్వకాలు జరుపగా మొదట మహబూబాబీ అస్థిపంజరం బయట పడింది. ఆ తరువాత ఆబేదా బేగం మృతదేహం లభ్యమైంది. కాగా, పోలీస్ స్టేషన్ లో విచారణ జరుగుతున్న సమయంలో కరీమా బేగం బాత్రూం క్లీనర్ సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే, పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో రెహమాన్, నయీంలను నిశితంగా ప్రశ్నించారు. దీంట్లో సంచలన వివరాలు వెలుగు చూశాయి.
హత్య చేయాలని పథకం
అవసరాల కోసం తాము మహబూబాబీ, ఆబేదా బేగంతోపాటు మరో ఆరుగురి నుంచి అప్పులు చేసినట్టు నిందితులు వెల్లడించారు. చేసిన అప్పులు తీర్చలేక అందరినీ హత్య చేయాలని పథకం వేసుకున్నట్టు చెప్పారు. దాని ప్రకారమే మహబూబాబీ, ఆబేదా బేగంను డబ్బు ఇస్తామని నమ్మించి తోల్ కట్ట ప్రాంతానికి తీసుకొచ్చి చంపేశామని అంగీకరించారు. ఈ మేరకు ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, తాజాగా నిందితులపై మరికొందరు మహిళలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కరీమా బేగం తమ నుంచి కూడా అప్పులు తీసుకున్నట్టు చెప్పారు. ఇటీవల తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి తమను కూడా తోల్ కట్ట ప్రాంతానికి రావాలని చెప్పిందని వివరించారు. కరీమా బేగం చెప్పిన టైంకు తాము వెళ్లి ఉంటే తమను కూడా హత్య చేశారని పేర్కొన్నారు. కేసులో చాకచక్యంగా దర్యాప్తు జరిపి నిందితులను అరెస్ట్ చేయటం ద్వారా తమ ప్రాణాలను కాపాడిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Also read: జగదీష్ రెడ్డి పై ఎంపీ చామల సెటైర్లు.. ఏమన్నారంటే?

