Dailyhunt
ముగ్గురు ముఖ్యమంత్రులకు మూడింది.. కంచుకోటలు బద్దలు?

ముగ్గురు ముఖ్యమంత్రులకు మూడింది.. కంచుకోటలు బద్దలు?

Big TV Live 1 week ago

3 Chief ministers Bitter Defeat: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి.. మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీల కుర్చీలు తారుమారయ్యాయి. ఒకటి తూర్పు, మరో రెండు దక్షిణాది రాష్ట్రాలు.

ఈసారి ఎన్నికల్లో ఆయా నేతలు ఏళ్ల తరబడి కట్టుకున్న కంచుకోటలు సైతం నేలకూలాయి? ఆయా ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దీనికి కారణమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

మమతా కోటలో కమల విరిసింది : పశ్చిమబెంగాల్ ఈ పేరు చెబితే ఒకప్పుడు కమ్యూనిస్టులు బలంగా వినిపించేది. వారి కంచుకోటలను కూల్చి అధికారంలోకి వచ్చారు మమతా బెనర్జీ. ఏకంగా మూడు పర్యాయాలు టీఎంసీని అధికారంలోకి వచ్చారు. నాలుగోసారి మాత్రం ఓటర్లు ఆ పార్టీని దూరంగా పెట్టారు. 293 సీట్లున్న బెంగాల్ శాసనసభకు రెండువిడతలుగా ఎన్నికలు జరిగాయి.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి 92 శాతం పైగానే పోలింగ్ నమోదు అయ్యింది. అప్పుడే ఓటమి ఖాయమని అధికార పార్టీ డిసైడ్ అయ్యింది. సోమవారం వెలువడిన ఫలితాల్లో అదే జరిగింది. కేవలం 100 సీట్లకు పరిమితమైంది. విపక్షంగా పదేళ్లు బెంగాల్ ప్రజలకు దగ్గరైన బీజేపీ, 180 పైచిలుకు సీట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలిసారి బెంగాల్‌ కోటలో కాషాయి జెండా రెపరెపలాడింది.

కేరళలో కమ్యూనిస్టుల కోటలకు బీటలు: ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికి వద్దాం. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటలు బద్దలవుతున్నాయి. తొలుత బెంగాల్, ఆ తర్వాత త్రిపుర, ఇప్పుడు కేరళ కోటలో కమ్యూనిస్టుల కోటలు బద్దలవుతున్నాయి. కేరళ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. కమ్యూనిస్టులకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. రెండుసార్లు వరుసగా ముఖ్యమంత్రిగా పని చేసిన పినరయి విజయన్, హ్యాట్రిక్‌పై కన్నేశారు. గోల్డ్ వ్యవహారం కమ్యూనిస్టుల ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిందనే చెప్పవచ్చు. ఈ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోకపోవడంతో కమ్యూనిస్టులు-బీజేపీ ఒక్కటయ్యాయని ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ.

ఓవైపు యూడీఎఫ్, మరోవైపు బీజేపీ వల్ల నెగిటివ్ ఓటు బ్యాంక్ చీలిపోతుందని సీఎం విజయన్ భావించారు. ఈసారి మాత్రం ప్రజలు ఆయన్ని పక్కన పెట్టేశారు. గత ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకున్న కమ్యూనిస్టుల నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్.. ఈసారి మాత్రం 40 సీట్లకు పడిపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు ఊహించని మెజార్టీని అందించారు. మొత్తం 140 సీట్లున్న కేరళ అసెంబ్లీలో మ్యాజిగ్ ఫిగర్- 71 సీట్లు. యూడీఎఫ్‌కు 98 సీట్లలో ఆధిక్యం కొనసాగుతోంది. అధికార ఎల్‌డీఎఫ్ కేవలం 40 సీట్ల దిగువకు పరిమితమైంది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే రెండు సీట్లకు పరిమితమైంది.

ద్రవిడ రాజకీయాలకు కేరాఫ్: ద్రవిడ రాజకీయాలకే కేరాఫ్ తమిళనాడు. ఈసారి అక్కడి ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. విపక్ష అన్నాడీఎంకెను దూరంగా పెట్టారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ పార్టీని ఆదరించారు. గడిచిన నాలుగైదు దశాబ్దాలుగా నటుల ఆ పార్టీకి పట్టం కట్టారు అక్కడి ఓటర్లు. అయితే జయలలిత, కరుణానిధి చనిపోవడంతో వారి లేని లోటు స్పష్టంగా కనిపించింది. దీన్ని ముందుగానే పసిగట్టిన విజయ్, పార్టీ పెట్టడం, జనాల్లో వెళ్లడం, ద్రవిడ సిద్ధాంతాలను ఏ మాత్రం టచ్ చేయకుండా ప్రచారం చేయడం ఆయనకు కలిసొచ్చింది.

2026 ఎన్నికల ఫలితాలు.. బీజేపీదే హవా.. ‘ఇండియా’ కూటమికి అంతిమ ఘడియలు అంటున్న జీవీఎల్

ఒకవిధంగా చెప్పాలంటే అధికార డీఎంకె పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు తమిళ ఓటర్లు. స్టాలిన్ పాలనలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని అక్కడి ప్రజల మాట. దానికి అడ్డుకట్ట వేయడంలో విఫలం కావడంతో అధికార పార్టీని మూడోస్థానానికి నెట్టేశారు ఓటర్లు. 234 సీట్లున్న తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు. అయితే విజయ్ పార్టీకి దాదాపు 108 సీట్ల దగ్గరలో ఉంది. మ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 సీట్లు తక్కువ. అదే సమయంలో డీఎంకె, అన్నాడీఎంకెకు చెందిన గెలిచిన అభ్యర్థులు టీవీకె పార్టీలో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగ్గురు ముఖ్యమంత్రుల పీఠాలు కదిలిపోయాయని చెప్పవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live