Hyderabad Traffic: తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని ముఖ్యమంత్రి శ్రీ ఎ.
రేవంత్ రెడ్డి డిజిపి శ్రీ సివి ఆనంద్ కు సూచించారు. ముఖ్యమంత్రి బుధవారం నాడు ఢిల్లీ వెళ్తున్న క్రమంలో విమానాశ్రయం సమీపంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం సాధారణ ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని, ముఖ్యమంత్రి వాహనాలు వెళ్లే దారితో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా ఆపివేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిజిపి కి ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్
ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ సమస్యపై ముఖ్యమంత్రి పదేపదే మాట్లాడాల్సి రావడం సమస్య తీవ్రతను తెలియజేస్తోందని, క్షేత్రస్థాయి అధికారులు దీనిని గంభీరంగా పరిగణించాలని డిజిపి శ్రీ సివి ఆనంద్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణను పటిష్టం చేసేందుకు అడిషనల్ డిజిపి ఆధ్వర్యంలో త్వరలోనే 'ట్రాఫిక్ బ్యూరో' ఏర్పాటు చేస్తున్నామని ప్రస్తుతం విధివిధానాలను రూపొందిస్తున్నామని డిజిపి శ్రీ సివి ఆనంద్ వెల్లడించారు.
కొండాయికి 'సీతక్క' భరోసా.. వరద బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు, రూ. 16 కోట్లతో అభివృద్ధి పనులు!
డిజిసి శ్రీ సివి ఆనంద్ సూచనలు
ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయకుండా, సింగిల్ లైన్గా విభజించి వాహనాలను పంపించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి సత్వర నిర్ణయాలు తీసుకోవాలని, సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని డిజిపి శ్రీ సివి ఆనంద్ సూచించారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్
ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్ లేకుండా చూడాలని, ఐఎస్ డబ్ల్యూ, సీఎస్ డబ్ల్యూ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతల విభాగం అధికారులు కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో హైదరాబాద్ మే శ్రీ వి.సి. సజ్జనార్, సైబరాబాద్ సిపి శ్రీ ఎం. రమేష్, మల్కాజిగిరి సిపి శ్రీమతి బి. సుమతి, ఫ్యూచర్ సిటీ జాయింట్ సిపి శ్రీమతి చందనా దీప్తి, రైల్వేలు మరియు రోడ్డు సేఫ్టీ ఐజిపి శ్రీ రమేష్ నాయుడు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, ఐఎస్డబ్ల్యూ ఓఎస్డి శ్రీ కమలాసన్ రెడ్డి, సిఎంఎస్జి ఎస్పీ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

