Naganpalli: కంగ్టి మండలం నాగన్పల్లి గ్రామంలో గుండెల్ని పిండేసే విషాదం జరిగింది. నిన్నటివరకు తమ కళ్లముందే నవ్వుతూ, ఆడుతూ తిరిగిన ఎనిమిదేళ్ల చిన్నారి కీర్తిక..
వడదెబ్బకు బలైపోతుందనని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించలేదు. ఎండల తీవ్రత ఒక ప్రాణాన్ని బలితీసుకోవడం స్థానికంగా అందరినీ తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.
స్వగ్రామానికి చెందిన సంజీవ్ కుమార్తె కీర్తిక గురువారం పగలంతా ఇంట్లోనే ఎంతో ఉల్లాసంగా గడిపింది. అయితే రాత్రి అయ్యేసరికి ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. తీవ్రమైన జ్వరం రావడంతో పాటు శరీరం పూర్తిగా నీరసించిపోయింది. కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు చిన్నారిని బ్రతికించడానికి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో కీర్తిక కన్నుమూసింది. చిన్నారి మరణవార్త వినగానే తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించడం చూసి అక్కడున్న వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. నిన్నటివరకు తమ మధ్యే తిరిగిన పాప ఇక లేదనే సరికి నాగన్పల్లి గ్రామం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

