Karimnagar Theft: కరీంనగర్ నడిబొడ్డున జరిగిన జ్యూవెలరీ షాప్ చోరీ ఘటన ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటుగా స్పందించారు.
కేవలం దొంగతనం వివరాలే కాకుండా, ప్రతిపక్ష నేతలు కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
అంత రాష్ట్ర దొంగల పనే.. వదిలిపెట్టేది లేదు..
కరీంనగర్ గోల్డ్ షాప్లో జరిగిన ఈ దొంగతనం ఆషామాషీ వ్యవహారం కాదని, ఇది అంతరాష్ట్ర ప్రొఫెషనల్ దొంగల పని అని మంత్రి స్పష్టం చేశారు. ' షాపులోని ఉద్యోగులు దొంగలను ఎదిరించే ప్రయత్నం చేసినప్పుడు వారు పిస్టల్తో కాల్పులు జరిపారు. ఆ పిస్టల్ డమ్మీ అని భావించి ఉద్యోగులు అడ్డుకోచోయారు. కానీ, అది నిజమైన ఆయుధమని తేలింది' అని ఆయన వివరించారు. ఇప్పటికే ఒక నిందితుడిని బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించామని, త్వరలోనే గ్యాంగ్ మెుత్తాన్ని పట్టుకుని తీరుతామని భరోసా ఇచ్చారు.
కేటీఆర్, హరీష్ రావులపై ఫైర్..
ఈ ఘటనను ఆసరాగా చేసుకుని ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరస్కరించినా కేటీఆర్, హరీష్ రావులకు బుద్ధి రాలేదని, ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంచల్గూడ జైలులో నేరగాళ్లతో సంబంధాలు ఉన్నాయంటూ మాట్లాడటం దారుణమని ' నిజమైన పాపాల భైరవులు మీరే' అంటూ అడ్లూరి లక్ష్మణ్ ధ్వజమెత్తారు.
రైతు కంట తడి తుడిచిన 'ఉత్తమ్' నిర్ణయం.. తడిసిన ధాన్యానికి లైన్ క్లియర్!
పాత పాపాలను గుర్తు చేస్తూ..
గత ప్రభుత్వం హయాంలో జరిగిన దారుణాలను మంత్రి ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. ' మంతని అడ్వకేట్ దంపతులు చనిపోయే ముందు పుట్ట మధు పేరు చెప్పారని, ఆ హత్యలకు కేటీఆర్, హరీష్ రావులే బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. ఇసుక మాఫియాకు అడ్డుపడ్డారని దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, వారిని శారీరకంగా పనికి రాకుండా చేసిన చరిత్ర మీది కాదా అని నిలదీశారు.
అక్కా బావల పోరుతో , అసలు పార్టీ ఉంటుందో లేదో తెలియక కేటీఆర్ నోరు పారేసుకుంటున్నారని, ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని మంత్రి హెచ్చరించారు. ' మేమే రాజులం, మేమే మంత్రులం ' అనుకునే రోజులు పోయాయని, ఖబడ్దార్ అంటూ ఘాటుగా హెచ్చరించారు.

