Yoga for foot pain relief: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన శరీర బరువంతటినీ మోసేది పాదాలే. అయితే లైఫ్ స్టైల్ , శారీరక శ్రమ లేకపోవడం, లేదా యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల చాలా మంది పాదాల నొప్పులు, మడమల నొప్పి, నరాలు లాగడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు.
దీని కోసం పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత గుణం ఉండదు. సాంప్రదాయ యోగాశాస్త్రంలో పాదాల నరాలను బలోపేతం చేయడానికి.. అంతే కాకుండా రక్త ప్రసరణను మెరుగు పరచడానికి కొన్ని అద్భుతమైన ఆసనాలు ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా వేయడం ద్వారా పాదాల నొప్పి నుంచి తక్షణ ఉపశమనం ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.
పాదాల నరాలను బలపరిచే 5 పవర్ఫుల్ యోగాసనాలు:
ఈ క్రింది యోగాసనాలు పాదాల్లోని కండరాలను సాగదీసి, నరాల బలహీనతను తొలగిస్తాయి:
1. తాడాసనం:
ఇది చాలా సరళమైన ఆసనం అయినప్పటికీ.. పాదాల పటుత్వానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
ఎలా వేయాలి: నేరుగా నిలబడి, రెండు చేతులను పైకి చాచి, నమస్కార ముద్ర పెట్టాలి. ఇప్పుడు మెల్లగా మీ మడమలను పైకి లేపుతూ, కేవలం కాలి వేళ్లపై శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి.
ప్రయోజనం: ఇది కాలి వేళ్లు, మడమలు, పిక్కల నరాలపై ఒత్తిడిని తగ్గించి రక్తప్రసరణను వేగవంతం చేస్తుంది.
2. వజ్రాసనం:
భోజనం చేసిన తర్వాత వేయగలిగే ఏకైక ఆసనం వజ్రాసనం. ఇది జీర్ణక్రియకే కాక పాదాలకు కూడా ఎంతో మంచిది.
ఎలా వేయాలి: మోకాళ్లను వెనుకకు మడచి, మడమలపై నిటారుగా కూర్చోవాలి. రెండు చేతులను మోకాళ్లపై ఉంచి ప్రశాంతంగా శ్వాస తీసుకోవాలి.
ప్రయోజనం: ఈ ఆసనంలో కూర్చోవడం వల్ల తొడలు, మోకాళ్లు, మరియు పాదాల నరాలకు మంచి స్ట్రెచింగ్ దొరుకుతుంది. కాలి నరాల వాపులు తగ్గుతాయి.
3. అధోముఖ శ్వానాసనం:
ఈ ఆసనం మొత్తం శరీరానికి ఒక మంచి వ్యాయామం లాంటిది.
ఎలా వేయాలి: బోర్లా పడుకుని, అరచేతులు, పాదాలను నేలపై ఉంచి, నడుము భాగాన్ని పైకి లేపాలి. శరీరం ‘V’ ఆకారంలోకి రావాలి. మీ చూపులు నాభి (బొడ్డు) వైపు ఉండాలి.
ప్రయోజనం: కాలి వెనక భాగంలోని నరాలు, అరిపాదాల కండరాలు బాగా సాగుతాయి. ఇది మడమ నొప్పులకు అద్భుత నివారణి.
4. వీరభద్రాసనం :
శరీరానికి వీరుడి వంటి బలాన్ని ఇచ్చే ఆసనం ఇది.
ఎలా వేయాలి: రెండు కాళ్ల మధ్య దూరం ఉంచి, ఒక కాలును ముందు వైపునకు వంచి, రెండు చేతులను పైకి చాచాలి.
ప్రయోజనం: ఇది పాదాల యొక్క ఆర్చ్ను బలపరుస్తుంది. ఫ్లాట్ ఫుట్ సమస్య ఉన్నవారికి ఈ ఆసనం చక్కటి పరిష్కారం.
5. విపరీత కరణి :
రోజంతా నిలబడి పనిచేసి అలసిపోయిన వారికి ఇది ఒక అద్భుతమైన రిలాక్సేషన్ ఆసనం.
ఎలా వేయాలి: గోడ పక్కన పడుకుని, రెండు కాళ్లను గోడకు ఆనిస్తూ 90 డిగ్రీల కోణంలో పైకి పెట్టాలి. నిమిషాల పాటు ఇలాగే విశ్రాంతి తీసుకోవాలి.
ప్రయోజనం: పాదాలలో పేరుకుపోయిన రక్తం తిరిగి గుండె వైపు ప్రవహిస్తుంది. దీని వల్ల పాదాల అలసట, నొప్పులు క్షణాల్లో మాయమవుతాయి.
సింపుల్ చిట్కాలు:
యోగాసనాలతో పాటు రాత్రి పూట ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నొప్పులు త్వరగా తగ్గుతాయి.
ఉప్పు నీటి కాపడం: ఒక టబ్లో గోరు వెచ్చని నీటిని తీసుకుని, అందులో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ (రక్తాన్ని శుద్ధి చేసే ఉప్పు) లేదా రాళ్ల ఉప్పు వేసి, పాదాలను 15 నిమిషాల పాటు ఉంచాలి.
ఆయిల్ మసాజ్: పడుకునే ముందు కొద్దిగా గోరువెచ్చని ఆవనూనె లేదా నువ్వుల నూనెతో అరి పాదాలను మసాజ్ చేయడం వల్ల నరాలు ఉత్తేజితమవుతాయి.
పాదాల నొప్పి అనేది మన జీవితాన్ని దెబ్బతీసే తీవ్రమైన సమస్య. దీనిని నివారించడానికి తాడాసనం, వజ్రాసనం, విపరీత కరణి వంటి ఆసనాలు అద్భుత ఔషధాలుగా పనిచేస్తాయి. ఉదయం కనీసం 15 నిమిషాల పాటు యోగా కోసం కేటాయించడం వల్ల నరాల బలహీనత సమస్య దరిచేరదు. అయితే.. ఒకవేళ పాదాల నొప్పులు యూరిక్ యాసిడ్ లేదా డయాబెటిస్ (మధుమేహం) వల్ల వస్తున్నట్లయితే.. యోగాతో పాటు డాక్టర్ ల సలహా మేరకు సరైన చికిత్స తీసుకోవడం ఎంతో మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

