Uttam Kumar Reddy: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
దేవాదుల, ఎస్.ఎల్.బీ.సీ, సీతారామ ప్రాజెక్టులతో సరి సమానంగా పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. పాలమూరు జిల్లా ప్రజలకు సమృద్ధిగా సాగు, త్రాగు నీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
మంగళవారం సచివాలయంలో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో కలసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణాల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దెందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మరో 15 రోజుల్లో ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై పునఃసమీక్షిస్తామని పేర్కొన్నారు.
మరోవైపు జూరాల ప్రాజెక్టులో పెద్ద ఎత్తున మట్టి పేరుకుపోయి 8 TMCలు దిగువకు నీటి సామర్థ్యం తగ్గిపోవడంపై మంత్రి ఉత్తమ్ స్పందించారు. పూడిక తీసి నీటి సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు వీలుగా డి.ఆర్.ఐ.పికు ప్రతిపాదనలు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. పూడిక తీత పనులతో నీటి సామర్ధ్య నిల్వలు పెంచడమే కాకుండా రిజర్వాయర్ భద్రత, నిర్వహణను మరింత మెరుగు పరుస్తామన్నారు. అదే విధంగా చిన్న తరహా సాగునీటి చెరువులలో వర్షా కాలానికి ముందే పూడిక తీత పనులు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. ఒక్క హైదరాబాద్లోనే 16,000 దుకాణాలు క్లోజ్!
మరోవైపు తమ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90% పూర్తి అయ్యాయని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మంత్రి ఉత్తమ్ తేల్చి చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టు ఆఫ్ టెక్ ను జూరాల నుండి శ్రీశైలం రిజర్వాయర్ కు మార్చడంతో తీవ్రంగా నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు. భూసేకరణ జరపకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్ నెట్ వర్క్ కు టెండర్లు పిలిచి చేతులు దులుపుకుందని ఎద్దేవా చేశారు.

