Dailyhunt
ప్రపంచంలో తొలి లేడీస్ స్పెషల్ ట్రైన్..  స్ఫూర్తిదాయక ప్రయాణానికి 34 ఏళ్లు!

ప్రపంచంలో తొలి లేడీస్ స్పెషల్ ట్రైన్.. స్ఫూర్తిదాయక ప్రయాణానికి 34 ఏళ్లు!

Big TV Live 4 days ago

Ladies Special Trains in Mumbai:భారతీయ రైల్వేలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ముంబై లేడీస్ స్పెషల్ ట్రైన్. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన 'లేడీస్ స్పెషల్' సబర్బన్ రైలు సర్వీస్ 34 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా రైల్వే బోర్డు ఈ సర్వీసును గుర్తు చేసింది. మహిళల ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపుగా అభివర్ణించింది. 1992 మే 5న చర్చ్‌ గేట్ నుంచి బోరివాలి వరకు మొదలైన ఈ రైలు, ఆ తర్వాత ముంబై లోకల్రైలు వ్యవస్థలో కీలకంగా మారింది.

మహిళల సురక్షిత ప్రయాణం కోసం..

ముంబై నగరంలో పని చేసే మహిళల సంఖ్య పెరుగుతుండటంతో, వారికి సురక్షితంగా, సౌకర్యంగా ప్రయాణించే అవకాశాలు అవసరమయ్యాయి. ముఖ్యంగా రద్దీ సమయాల్లో సాధారణ రైళ్లలో ప్రయాణించడం మహిళలకు కష్టంగా ఉండేది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ప్రత్యేకంగా ఈ సర్వీసును ప్రారంభించారు. మహిళలకు మాత్రమే కేటాయించాలనే రైలు ఆలోచన అప్పట్లో అందరినీ ఆకట్టకుంది.

సింపుల్ గా లేడీస్ స్పెషల్ రైలు ప్రారంభం

ఈ రైలు సర్వీసు ప్రారంభం చాలా సాధారణంగా జరిగింది. అప్పట్లో దేశ ప్రధాని పి.వి. నరసింహారావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుధాకర్‌ రావు నాయక్ ఉన్నప్పటికీ, ఎటువంటి పెద్ద కార్యక్రమాలు లేకుండా రైలును ప్రారంభించారు. వెస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్, కొంతమంది సీనియర్ అధికారులతో కలిసి ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఆ సమయంలో ఇది చిన్న ప్రయత్నంలా కనిపించినా, తర్వాత ఇది వేలాది మహిళలకు రోజువారీ జీవితంలో భాగమైంది.

మొదట చర్చ్‌ గేట్ నుంచిబోరివాలి వరకు మాత్రమే నడిచిన ఈ రైలును, 1993లో విరార్ వరకు విస్తరించారు. సిటీ పరిధి పెరగడంతో పాటు ఉద్యోగాల కోసం బయటకు వెళ్లే మహిళల సంఖ్య కూడా పెరిగింది. ఈ రైళ్ల సంఖ్యను కూడా క్రమంగా పెంచారు. ప్రస్తుతం వెస్టర్న్ రైల్వే ప్రతిరోజూ సుమారు 10 లేడీస్ స్పెషల్ సర్వీసులను నడుపుతోంది. ఇవి ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లోనే ఉంటాయి. అప్ రైళ్లు విరార్, బోరివాలి, భయందర్, వసాయి రోడ్ లాంటి ప్రాంతాల నుంచి చర్చ్‌ గేట్ వైపు ప్రయాణిస్తాయి. అలాగే డౌన్ రైళ్లు చర్చ్‌గేట్ నుండి తిరిగి బోరివాలి, విరార్ దిశగా వెళ్తాయి. ఈ రైళ్ల సమయాలను మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేశారు. ఉద్యోగాలకు వెళ్లే సమయాలు, తిరిగి వచ్చే సమయాలకు సరిపోయేలా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

మహిళల మధ్య అనుబంధాన్ని పెంచేలా..

ఈ లేడీస్ స్పెషల్ రైళ్లు కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాకుండా, మహిళల మధ్య అనుబంధాన్ని కూడా పెంచాయి. ఒకే రైలులో రోజూ ప్రయాణించే మహిళలు పరస్పరం పరిచయం పెంచుకుని, ఒకరికొకరు సహాయం చేసుకునే వాతావరణం ఏర్పడింది. సాధారణ రైళ్లలో ఉండే రద్దీ, అసౌకర్యం, భద్రత సమస్యలు ఈ ప్రత్యేక రైళ్లలో చాలా వరకు తగ్గాయి. ఈ సర్వీసు మహిళల జీవితంలో పెద్ద మార్పును తీసుకువచ్చింది. ముంబైలో మహిళల కోసం ఈ లేడీస్ స్పెషల్ రైళ్లు సురక్షితమైన, నమ్మకమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి.

Read Also: వందేభారత్ ఫుడ్ సేఫ్ కాదా? భయపెడుతున్న తాజా ల్యాబ్ రిపోర్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live