Wildlife Protection: స్వేచ్ఛ బ్యూరో: ఇకపై దట్టమైన అడవుల్లోకి వెళ్లినా, టైగర్ రిజర్వ్లలో సఫారీకి ప్లాన్ చేసినా మీ స్మార్ట్ ఫోన్కు పనిపడనట్లే!
వన్యప్రాణుల ఆవాసాల్లో టూరిస్టుల మొబైల్ ఫోన్ల హడావుడికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. టైగర్ రిజర్వ్లు, నేషనల్ పార్కుల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కసరత్తు చేస్తోంది. వన్యప్రాణుల ప్రశాంతతకు భంగం కలగకుండా చూడటమే పరమావధిగా ఈ సరికొత్త నిబంధనలను తీసుకువస్తున్నారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మన రాష్ట్రంలోని అటవీశాఖ కూడా ఈ రూల్స్ అమలు చేయడానికి సన్నద్ధమవుతోంది.
కేంద్ర ప్రభుత్వం కసరత్తు..
అడవి అంటేనే అంతులేని ప్రశాంతత.. పక్షుల కిలకిలరాగాలు, వన్యప్రాణుల స్వేచ్ఛా విహారాలు. కానీ, ఈ మధ్యకాలంలో అడవుల్లోకి టూరిస్టుల తాకిడి పెరగడంతో ఆ ప్రశాంతత కరువైంది. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల హడావుడి వన్యప్రాణుల మనుగడకు పెద్ద శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో టైగర్ రిజర్వ్లలో స్మార్ట్ ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అడవిలోకి అడుగుపెట్టే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లను స్విచ్చాఫ్ చేయడమో, లేదా ప్రవేశ ద్వారం వద్దే డిపాజిట్ చేయడమో తప్పనిసరి చేసేలా సరికొత్త నిబంధనలను తీసుకురాబోతోంది.
సెల్ఫీల గోల.. రీల్స్ పిచ్చి!
టైగర్ సఫారీలకు వెళ్లే పర్యాటకులు వన్యప్రాణులను చూడగానే నిశ్శబ్దంగా ఉండాల్సింది పోయి, ఫోన్లతో హడావుడి చేస్తున్నారు. జంతువులను మరీ దగ్గరగా ఫోటోలు తీయడం, ఫ్లాష్ లైట్లు ఆన్ చేయడం, సెల్ఫీల కోసం ప్రమాదకరంగా వాహనాల నుంచి దిగడం వంటి పనులు చేస్తున్నారు. కొందరైతే సామాజిక మాధ్యమాల్లో ‘రీల్స్’, లైవ్ వీడియోల కోసం జంతువులను కదిలించేలా గట్టిగా అరుస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. దీనివల్ల పులులు, చిరుతలతో పాటు ఇతర వన్యప్రాణులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాయని, వాటి సహజ సిద్ధమైన ప్రవర్తన మారిపోతోందని అధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయాలంటే మొబైల్ రహిత జోన్గా మార్చడమే ఏకైక మార్గమని కేంద్రం భావిస్తోంది.
సీఎం విజయ్పై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు.. స్టాలిన్తో స్నేహంపై క్లారిటీ!
లొకేషన్ల లీకేజీ.. వేటగాళ్లకు వరంగా మారే ప్రమాదం!
స్మార్ట్ ఫోన్ల వల్ల వన్యప్రాణుల ప్రశాంతత దెబ్బతినడమే కాకుండా, వాటి భద్రతకు కూడా ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడవిలో పులి ఎక్కడ కనిపించిందో పర్యాటకులు ఫోటోలు తీసి, ‘లైవ్ లొకేషన్’ ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇది పరోక్షంగా వన్యప్రాణుల వేటగాళ్లకు (పోచర్స్) సమాచారం అందించినట్లు అవుతోంది. పులుల కదలికలను సులువుగా ట్రాక్ చేసే అవకాశం వేటగాళ్లకు దక్కకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ రకమైన నిషేధానికి మొగ్గు చూపుతోంది.
కేంద్రంప్రతిపాదిత నిబంధనలు ఇవే?
టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా (సఫారీ ప్రాంతం)లోకి వెళ్లేటప్పుడు ఫోన్లు పూర్తిగా అనుమతించబడవు. సఫారీ వాహనాలు ఎక్కే ముందే పర్యాటకులు తమ ఫోన్లను చెక్పోస్టుల వద్ద భద్రపరుచుకోవాలి.కేవలం ఫోటోగ్రఫీ కోసం వచ్చే వారికి, ఫ్లాష్ లైట్ లేని సాధారణ డిజిటల్ కెమెరాలను మాత్రమే (నిర్ణీత రుసుముతో) అనుమతించే అవకాశం ఉంది.నిబంధనలు ఉల్లంఘించి దొంగచాటుగా ఫోన్లు తీసుకెళ్లినా, ఫ్లాష్ లైట్లతో జంతువులను ఇబ్బంది పెట్టినా భారీగా జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు.త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ఇకపై అడవి అందాలను కళ్లతో చూసి ఆస్వాదించాలే తప్ప.. కెమెరా కళ్లతో బంధించడం కుదరదని అటవీశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Also read: సోలార్ కరెంటును పెంచేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!
ఆమ్రాబాద్', 'కవ్వాల్' లోనూ నో ఫోన్స్!
కేంద్రం యోచిస్తున్న ఈ సరికొత్త నిబంధనలను రాష్ట్రంలోనూ తక్షణమే అమలు చేసేందుకు తెలంగాణ అటవీశాఖ సమాయత్తమవుతోంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారంరాష్ట్రంలోని ప్రముఖ టైగర్ రిజర్వ్లైన ఆమ్రాబాద్, కవ్వాల్ ప్రాంతాల్లో ఈ ఆంక్షలు మొదటగా అమలు కానున్నట్లు సమాచారం. పులుల సంఖ్య ఎక్కువగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.
సంచలన నిర్ణయం
ఇకపై టైగర్ రిజర్వ్లకు వెళ్లేవారు కేవలం ప్రకృతిని కళ్లతో చూసి ఆస్వాదించాల్సిందే కానీ, డిజిటల్ స్క్రీన్లలో బంధించడం కుదరదు. వన్యప్రాణుల రక్షణ, పర్యావరణ సమతుల్యత కోసం తీసుకోబోతున్న ఈ సంచలన నిర్ణయంపై అటు పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తుండగా, సోషల్ మీడియా ప్రియులకు మాత్రం ఇది కాస్త నిరాశ కలిగించే విషయమే. ఏదేమైనా.. “అడవి మనది కాదు.. వన్యప్రాణులది” అని గుర్తించాల్సిన సమయం ఆసన్నమవుతోంది.
Also read: పంట వ్యర్థాలను పొలంలో కాల్చేస్తున్నారా.. అయితే మీరు ఫైన్ కట్టాల్సిందే?

