Wildlife Protection: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతుంది. అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే మూగజీవాల ప్రాణాలకు భద్రత కల్పించడంతో పాటు, ప్రమాదాల బారిన పడిన వన్యప్రాణులను తక్షణమే కాపాడేందుకు అటవీ శాఖ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది.
ఇందులో భాగంగా అత్యాధునిక సాంకేతికత, ప్రత్యేక రెస్క్యూ బృందాలను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది.
'రెస్క్యూ టీం' భరోసా..
అడవుల్లో గాయపడిన లేదా వేటగాళ్ల దాడులతో గాయాలైన లేదా జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాల్లో చిక్కుకున్న జంతువులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 'రెస్క్యూ టీం' (రక్షణ బృందాలను) రంగంలోకి దించుతోంది. వీరికి తోడుగా అత్యంత వేగంగా స్పందించేందుకు వీలుగా 'ట్రక్ మౌంటెడ్ రెస్క్యూ వాహనాలను' త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు అటవీశాఖ సిద్దమవుతోంది. అత్యాధునిక వైద్య సదుపాయాలు, జంతువులను సురక్షితంగా తరలించే బోన్లు, క్రేన్లు ఈ ట్రక్కులలో ఉంటాయి. సమాచారం అందిన వెంటనే ఈ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని వన్యప్రాణులకు ప్రాథమిక చికిత్స అందిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో జంతువులను సురక్షిత ప్రాంతాలకు లేదా జూ పార్కులకు తరలించడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. వన్యప్రాణుల రక్షణ కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా శిక్షణ పొందిన ప్రత్యేక రెస్క్యూ టీంలను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
పులుల కోసం 'ప్రే ఆగ్మెంటేషన్' సెంటర్లు..
పులులు, చిరుతలు వంటి మాంసాహార జంతువులకు అడవుల్లో ఆహార కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అడవుల్లో 'ప్రే ఆగ్మెంటేషన్ సెంటర్లను' (శాకాహార జంతువుల పెంపక కేంద్రాలను) ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల ద్వారా దుప్పులు, జింకలు వంటి శాకాహార జంతువుల సంఖ్యను పెంచి, వాటిని దట్టమైన అడవుల్లోకి విడుదల చేస్తారు. దీనివల్ల వన్యప్రాణులు ఆహారం కోసం జనావాసాల వైపు రాకుండా అడ్డుకోవచ్చు.
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన తమ్మరెడ్డి భరద్వాజ.. ఫాన్స్కు పండగే..
కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్కు ప్రత్యేక కమిటీలు
గత కొంతకాలంగా కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, దాని పరిధిలోని బఫర్ జోన్లలో ఎదురవుతున్న స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అటవీ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజలతో కూడిన ఈ కమిటీలు.. వన్యప్రాణులు-మానవ సంఘర్షణలను తగ్గించేందుకు నిరంతరం కృషి చేస్తాయి. సరిహద్దు వివాదాలు, జంతువుల దాడిలో నష్టపోయిన రైతులకు పరిహారం వంటి అంశాలను ఈ కమిటీలు వేగంగా పరిష్కరిస్తాయి. అడవుల ఆక్రమణలు, పోడు భూముల వివాదాలు, వన్యప్రాణుల వేటను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
అడవి బాట పడితే.. టోల్ కట్టాల్సిందే!
వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాలకు ఆర్థిక వనరులు సమకూర్చేందుకు వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, టైగర్ రిజర్వ్ ఏరియాల గుండా వెళ్లే వాహనాలపై టోల్ ఫీజులను సవరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. బయటి ప్రాంతాల వాహనాలకు రూ.600, స్థానిక వాహనాలకు రాయితీగా రూ.300 టోల్ ఫీజు విధించాలని సూచించారు. ఈ సున్నితమైన ప్రాంతాల గుండా వెళ్లే వాహనాలపై ప్రత్యేకంగా 'టోల్' (గ్రీన్ టాక్స్ తరహాలో) విధించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఎందుకీ నిర్ణయం?
రిజర్వు అడవుల గుండా మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాల వల్ల వన్యప్రాణులు ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఈ టోల్ విధానం వల్ల అనవసరపు వాహనాల రాకపోకలు తగ్గడమే కాకుండా, దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా వన్యప్రాణుల సంరక్షణకు, రెస్క్యూ వాహనాల నిర్వహణకు మాత్రమే వినియోగిస్తారు. త్వరలోనే ఈ ఉత్తర్వులుజారీ చేసి అమలులోకి తీసుకురాబోతున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయాల పట్ల పర్యావరణ ప్రేమికులు, వన్యప్రాణి సంరక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also read: సామాన్యుడికి గుడ్ న్యూస్.. ఏసీ లేకున్నా లైఫ్ లాంగ్ కూలింగ్.. పైగా జీరో కరెంట్ బిల్లు!

