Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాపిడోకు షాకిచ్చిన ప్రభుత్వం..  బైక్ టాక్సీ, క్యాబ్ సర్వీసుల బంద్!

రాపిడోకు షాకిచ్చిన ప్రభుత్వం.. బైక్ టాక్సీ, క్యాబ్ సర్వీసుల బంద్!

Big TV Live 1 week ago

Rapido Services Banned: ప్రముఖ అగ్రిగేటర్ రాపిడో చిక్కుల్లో పడింది. ఆ సంస్థ అందిస్తున్న సేవలపై జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం నిషేధం విధించింది. అవసరమైన అనుమతులు లేకుండా బైక్ టాక్సీ, క్యాబ్ సేవలు నిర్వహిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర రవాణా అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం అక్కడ రాపిడో సేవలు అందుబాటులో లేవు.

రవాణా అధికారులు ఏం చెప్పారంటే?

రాపిడో సేవల నిషేధంపై జమ్మూ ప్రాంతీయ రవాణా అధికారి జస్మీత్ సింగ్ అధికారిక సర్క్యులర్ జారీ చేశారు. అందులో రాపిడోకు అగ్రిగేటర్ సర్టిఫికేట్ లేకపోవడంతో, అక్కడ సేవలు అందించే అవకాశం లేదన్నారు. రవాణా శాఖ అనుమతి లేకుండా ప్రయాణికుల రవాణా సేవలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.

అటు ఇదే విషయాన్ని రవాణా కమిషనర్ విశేష్ పాల్ మహాజన్ కూడా స్పష్టం చేశారు. రాపిడో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన అధికారిక లైసెన్స్ పొందలేదన్నారు. ఈ విషయంపై తమ కార్యాలయానికి పలు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన మహాజన్, ప్రజలు ఈ సేవలను ఉపయోగించే ముందు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అధికారిక అనుమతులు లేని సంస్థల సేవలను వినియోగించడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.

రవాణా కమిషనర్ కార్యాలయ అనుమతి తప్పనిసరి!

వాస్తవానికి ఏ అగ్రిగేటర్ సంస్థ అయినా జమ్మూ కాశ్మీర్‌ లో సేవలు ప్రారంభించాలంటే ముందుగా రవాణా కమిషనర్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. అలాగే, అవసరమైన అన్ని అనుమతులు, లైసెన్సులు పొందిన తర్వాత మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాలి. అంతేకాకుండా, స్థానికంగా ఓ కార్యాలయం, కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. దీనివల్ల వాహనాలు, డ్రైవర్లు, ప్రయాణికుల వివరాలను సమర్థవంతంగా పర్యవేక్షించడం సులభమవుతుందని చెప్పారు.

భద్రతా వ్యవహారంపై అధికారుల ఆందోళన

భద్రతా అంశాలపైనా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సరైన ధృవీకరణ లేకుండా నడిచే సేవలను కొంతమంది దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా సంఘ వ్యతిరేక లేదా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఇటువంటి సేవలు ఉపయోగపడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. అందుకే డ్రైవర్లు, వాహనాలు, సంబంధిత పత్రాల ధృవీకరణ చాలా అవసరమని అధికారులు స్పష్టం చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాపిడోపై విధించిన ఈ నిషేధం స్థానిక రవాణా రంగంలో చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో కంపెనీ అవసరమైన అనుమతులు పొందిన తర్వాత మాత్రమే సేవలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live