Dailyhunt
రాష్ట్రంలో ఈదురుగాలులతో భారీ వర్షం.. తడిసిన ధాన్యం, నేలకొరిగిన భారీ చెట్లు

రాష్ట్రంలో ఈదురుగాలులతో భారీ వర్షం.. తడిసిన ధాన్యం, నేలకొరిగిన భారీ చెట్లు

Big TV Live 2 weeks ago

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భానుడి భగభగలతో అల్లాడుతున్న జనాలకు వానలు ఉపశమనం అందించాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

ఎండవేడి నుంచి ఊరట లభించినప్పటికీ అన్నదాతలకు మాత్రం ఈ వర్షం కన్నీరు మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వానపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సూర్యాపేట జిల్లాలో ఈదురు గాలుల ధాటికి జనజీవనం స్తంభించింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన వర్షం పడింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధాన్యం రాశులపై కవర్లు కప్పేలోపే వర్షం ముంచెత్తింది. అటు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సైతం గాలివాన బీభత్సం సృష్టించింది. ఇక్కడి మార్కెట్‌ యార్డులో నిల్వ ఉంచిన ధాన్యం, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. కళ్ల ముందే పంట తడిసిపోతుంటే ఏం చేయలేక రైతులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మంచిర్యాల జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. మందమర్రి, రామకృష్ణాపూర్‌లో భారీ వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు పెద్ద వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. మందమర్రి, సింగరేణి కాలనీల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వడగళ్ల వర్షం కురిసింది. దొర్ల బంగ్లా నుంచి సీఈఆర్ మార్గంలో భారీ చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. అధికారులు రంగంలోకి దిగి చెట్లను తొలగించే ప్రక్రియను చేపట్టారు. అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వాన వల్ల సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, నేరేడుచర్ల, త్రిపురారం ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సాగింది. నకిరేకల్‌లో చెట్లు నేలకూలడంతో ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నడిగూడెం ప్రధాన రహదారిపై పెద్ద వృక్షం కూలడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన ఈ అకాల వర్షం అటు వేడి నుంచి ఉపశమనం ఇస్తూనే.. ఇటు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలని బాధితులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live