దేశ రాజధాని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుకు భారీ ఊరటనిచ్చింది. బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో రెండవ నిందితుడిగా (A-2) ఉన్న రఘురామ కృష్ణరాజు గురువారం నాడు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. విచారణ జరిపిన న్యాయస్థానం దర్యాప్తు సమయంలో నిందితుడిని అరెస్ట్ చేయనందున ఆయనకు బెయిల్ మంజూరు చేయడం సముచితమని భావించింది.
రఘురామ కృష్ణరాజుతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురికి కూడా న్యాయస్థానం ఊరటనిచ్చింది. రూ. 50,000 షురిటీ బాండ్పై వీరికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ సుమారు 15 వేల పేజీలకు పైగా ఉండటంతో నిందితుల తరపు న్యాయవాదులు కీలక విన్నపం చేశారు. అంత భారీ స్థాయిలో ఉన్న పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి (Scrutiny) సమయం కావాలని వారు కోర్టును కోరారు.
న్యాయవాదుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు పత్రాల పరిశీలన నిమిత్తం తదుపరి విచారణను జూలై 6, 2026 కి వాయిదా వేసింది. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న వివిధ కంపెనీల ప్రస్తుత స్థితిగతులపై కూడా కోర్టు ఆరా తీసింది. సదరు కంపెనీల లిక్విడేషన్ ప్రక్రియ ఏ దశలో ఉందో పూర్తి వివరాలను సమర్పించాలని సంబంధిత అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.
కాగా, రఘురామ కృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్.. పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి సుమారు 1,383 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న ఈ సంస్థ, అందులో 826.17 కోట్ల రూపాయలను నిబంధనలకు విరుద్ధంగా ఇతర ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకులను మోసగించినట్లు అభియోగాలు ఉన్నాయి.

