Mumbai-Pune Train Services Disrupted:మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు రైల్వే రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ముంబై-పుణె ఘాట్ సెక్షన్ లో కొండచరియలు విరిగిపడటంతో పాటు రైల్వే ట్రాక్ లపై భారీ బండరాళ్లు పడటంతో సెంట్రల్ రైల్వే పలు కీలక రైళ్లను రద్దు చేసింది.
మరికొన్ని రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నడుపుతోంది. మహారాష్ట్రాలోని ఠాకూర్వాడి-మంకీ హిల్, ఖండాలా-మంకీ హిల్ మధ్య ఘాట్ ప్రాంతంలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాక్లపై రాళ్లు, మట్టి పేరుకుపోయి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
16 రైళ్లు రద్దు.. 9 రైళ్లకు దారి మళ్లింపు
ముంబై-పుణె ఘాట్ సెక్షన్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో జూలై 6న నడవాల్సిన 16 రైళ్లను సెంట్రల్ రైల్వే పూర్తిగా రద్దు చేసింది. రద్దైన రైళ్లలో సీఎస్ఎంటీ-పుణె ఇంద్రాయణి ఎక్స్ ప్రెస్ (22105), పుణె-సీఎస్ఎంటీ ఇంద్రాయణి ఎక్స్ ప్రెస్ (22106), సీఎస్ఎంటీ-పుణె ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ (12127), పుణె-సీఎస్ఎంటీ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ (12128), సీఎస్ఎంటీ-పుణె డెక్కన్ ఎక్స్ ప్రెస్ (11007), పుణె-సీఎస్ఎంటీ డెక్కన్ ఎక్స్ ప్రెస్ (11008), సీఎస్ఎంటీ-పుణె డెక్కన్ క్వీన్ (12123), పుణె-సీఎస్ఎంటీ డెక్కన్ క్వీన్ (12124), సీఎస్ఎంటీ-పుణె ప్రగతి ఎక్స్ ప్రెస్ (12125), పుణె-సీఎస్ఎంటీ ప్రగతి ఎక్స్ ప్రెస్ (12126), సీఎస్ఎంటీ-పుణె సింహగడ్ ఎక్స్ ప్రెస్ (11009), పుణె-సీఎస్ఎంటీ సింహగడ్ ఎక్స్ ప్రెస్ (11010), సీఎస్ఎంటీ-ధూలే ఎక్స్ ప్రెస్ (11011), ధూలే-సీఎస్ఎంటీ ఎక్స్ ప్రెస్ (11012), అలాగే పుణె-సోలాపూర్ ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ (12169), సోలాపూర్-పుణె ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ (12170) ఉన్నాయి.
మరో 9 దూరప్రాంత రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపాలని సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. వీటిలో అహ్మదాబాద్-కొల్హాపూర్ ఎక్స్ ప్రెస్ (11049), ఇండోర్-డౌండ్ ఎక్స్ ప్రెస్ (22944), అహ్మదాబాద్-పుణె దురంతో ఎక్స్ ప్రెస్ (12297), బీదర్-సీఎస్ఎంటీ ఎక్స్ ప్రెస్ (22144), హజూర్ సాహిబ్ నాందేడ్-పన్వెల్ ఎక్స్ ప్రెస్ (17614), చర్లపల్లి-ఇండోర్ హంసఫర్ ఎక్స్ ప్రెస్ (20915), లోకమాన్య తిలక్ టెర్మినస్-ఎస్ఎంవీటీ బెంగళూరు ఎక్స్ ప్రెస్ (16554), డౌండ్-గ్వాలియర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (22193), చెన్నై ఎగ్మోర్-సీఎస్ఎంటీ మెయిల్ (22158) ఉన్నాయి. ఈ రైళ్లను కళ్యాణ్, ఇగత్పురి, మన్మాడ్, దౌండ్, అంకై, భుసావల్, జల్గావ్, సూరత్, పుణె మీదుగా ఆయా గమ్యస్థానాలకు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ట్రాక్ ల పునరుద్ధరణకు చర్యలు
ఘాట్ సెక్షన్ లో ట్రాక్ లను త్వరగా పునరుద్ధరించేందుకు సహాయక బృందాలు యుద్ధప్రాతిపదికన పని చేస్తున్నాయి. భారీ యంత్రాలతో రాళ్లు, మట్టిని తొలగించే పనులు కొనసాగుతున్నాయి. సెంట్రల్ రైల్వేతో పాటు వెస్ట్రన్ రైల్వే సిబ్బంది కూడా ఈ పనుల్లో పాల్గొంటున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గించేందుకు ముంబై సీఎస్ఎంటీ, థానే, లోనావాలా, దాదర్ రైల్వే స్టేషన్లలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ లు, హెల్ప్ లైన్ సేవలను అందుబాటులో ఉంచారు. రైళ్ల రద్దు, దారి మళ్లింపు, ప్రత్యామ్నాయ సర్వీసుల వివరాలను అక్కడ తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.
పరిస్థితిని సమీక్షిస్తున్న రైల్వేమంత్రి
మహారాష్ట్రలో పరిస్థితిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. కర్జాత్-లోనావాలా బోర్ ఘాట్ సెక్షన్ లో జరుగుతున్న పునరుద్ధరణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. రైల్వే ట్రాక్లను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
రాబోయే గంటల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. ట్రాక్ల క్లియరెన్స్ పూర్తయిన వెంటనే ముంబై-పుణె మార్గంలో రైళ్ల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేశారు. అప్పటి వరకు ప్రయాణికులు అధికారిక రైల్వే ప్రకటనలను గమనిస్తూ, తమ ప్రయాణ ప్రణాళికలను అందుకు అనుగుణంగా మార్చుకోవాలని రైల్వేశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

