తెలంగాణలో రైతు రుణమాఫీ అమలు తీరుపై సాగుతున్న రాజకీయ, న్యాయ పోరాటం కీలక మలుపు తిరిగింది. రాష్ట్రంలో అర్హులైన వేలాది మంది రైతులకు రుణమాఫీ ఫలాలు అందడం లేదంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హైకోర్టు గడప తొక్కారు.
ప్రభుత్వం ప్రకటించిన పథకం క్షేత్రస్థాయిలో విఫలమైందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టు ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది.
హరీశ్ రావు తరఫు న్యాయవాది కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు కాగితాలకే పరిమితం అవుతున్నాయని ఆరోపించారు. ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలోనే సుమారు 23 వేల మంది రైతులు రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నారని గణాంకాలతో వివరించారు. అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలు, ఇతర సాకులతో అన్నదాతలను పథకానికి దూరం చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అప్పుల బాధతో రైతులు తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారని వారి తరఫున న్యాయం చేయాలని కోరారు.
ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ వాదనలను తోసిపుచ్చారు. హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని వాదించారు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల సమస్య కాబట్టి వ్యక్తిగత పిటిషన్ సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి సామాజిక ప్రాధాన్యత ఉన్న విషయాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేయాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు.
హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ఇది ప్రజలందరికీ సంబంధించిన పెద్ద సమస్య కాబట్టి పిల్ రూపంలో వస్తే సమగ్రంగా విచారించవచ్చని సూచించింది. న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవించిన హరీశ్ రావు తన పాత పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. రైతుల పక్షాన మరింత గట్టిగా పోరాడేందుకు త్వరలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని ఆయన వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు న్యాయపరమైన పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.

