Ponguleti Srinivas Reddy: హనుమకొండలో నిర్వహించిన రైతు మేళాలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
రైతులను రాజులను చేసే వరకు తమ ప్రభుత్వం అడుగు వెనక్కి వేయదని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి దొర పోకడలు పోయిన బీఆర్ఎస్ నాయకులు.. ఇప్పుడు పదవి పోయిందన్న బాధతో ప్రజల్లోకి వెళ్తే ఎవరూ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. కడుపు నిండా విషం నింపుకున్న వారు ముసలి కన్నీళ్లు కారుస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. దీనికి కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయ రంగు పులుముతున్నారని మంత్రి ఆరోపించారు. “కల్లాల వద్దకు వెళ్లి సినిమాల తరహాలో ఫోజులు ఇచ్చి గులాబీ పేపర్లలో ఫొటోలు వేయించుకుంటున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రతి మాటను మా ప్రభుత్వం నిలబెట్టుకుంది. రైతుల కష్టాలు తీర్చడానికి అవసరమైతే తల తాకట్టు పెట్టడానికైనా సిద్ధమే తప్ప.. ప్రతిపక్షాల సొల్లు మాటలకు భయపడే ప్రసక్తే లేదు” అని ఆయన హెచ్చరించారు.
బీఆర్ఎస్, బీజేపీలు రెండూ తోడు దొంగలని పొంగులేటి అభివర్ణించారు. గతంలో ప్రధాని మోదీ.. అమిత్ షా వంటి అగ్రనేతలు కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడుకుంటున్నారని విమర్శలు చేశారని.. కానీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా నాటి పెద్దలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతితో పాటు యాదాద్రి.. భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై కూడా సీబీఐకి నివేదిక ఇస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తు రాజకీయ పొత్తుల కోసం ఈ కేసులను నీరుగార్చవద్దని ఆయన హితవు పలికారు.
రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమకు బీఆర్ఎస్తో లాలూచీ లేదని నిరూపించుకోవాలంటే వెంటనే సీబీఐ విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ పెద్దలు దోచుకున్న ప్రతి పైసా తిరిగి పేదవాడికి చెందాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని.. కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

