Praja Palana: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22వ తేదీన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు.
శామీర్పేట్ మండలంలోని అంతాయిపల్లిలో గల ఎస్ఎన్ఆర్ వేద్ కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ జిల్లా స్థాయి కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు పాల్గొననున్నారు.
కార్యక్రమంలో భాగంగా..
అదేవిధంగా జిల్లా కలెక్టర్, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కలెక్టర్లు, జోనల్ కమిషనర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, జిల్లా మార్కెటింగ్ మరియు గ్రంథాలయ కమిటీల చైర్మన్లు, ఆర్టీఐ కమిటీ సభ్యులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, పరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, జిల్లా స్థాయి సమస్యలు మరియు అభివృద్ధి ప్రాధాన్యతలను గుర్తించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ వివరించారు.
Also read: తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్!
ప్రభుత్వ పథకాల అమలును..
ఇప్పటివరకు నిర్వహించిన థీమాటిక్ వారాల విజయాలను ప్రదర్శించడంతో పాటు భవిష్యత్తులో అమలు చేయనున్న పథకాలపై కూడా అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేయడం, ప్రభుత్వ పథకాల అమలును ప్రజలకు చేరవేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.

