Ration Rice: స్వేచ్ఛ బ్యూరో: మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ పట్టణంలో అక్రమ రేషన్ బియ్యం నిల్వల వ్యవహారం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ప్రజలకు పంపిణీ చేయాల్సిన ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని కొంతమంది అక్రమంగా సేకరించి నిల్వ ఉంచుతున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి అక్రమ రేషన్ బియ్యం గోదాముగా మారిన విషయం బయటపడింది. పోలీసులు, సివిల్ సప్లైస్ అధికారుల సంయుక్త తనిఖీల్లో సుమారు 230 బస్తాలకు పైగా రేషన్ బియ్యం పట్టుబడినట్లు తెలిసింది. ఒక్కో బస్తాలో భారీ పరిమాణంలో బియ్యం నిల్వ ఉండటంతో మొత్తం విలువ లక్షల్లో ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బియ్యాన్ని చిన్నచిన్న ప్రాంతాల నుంచి సేకరించి ఒకేచోట నిల్వ చేసి, అనంతరం ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గుట్టుచప్పుడు కాకుండా సాగిన వ్యవహారం
సాధారణ నివాస గృహంగా కనిపించే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఈ స్థాయిలో బియ్యం నిల్వ ఉండటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. బయటకు ఎలాంటి అనుమానం రాకుండా ఇంటి తలుపులు మూసివేసి, రాత్రి వేళల్లోనే బస్తాల రవాణా జరిగినట్లు సమాచారం. కొంతకాలంగా ఆ ఇంటి వద్ద అనుమానాస్పద రాకపోకలు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ముగ్గురు బడా బాబుల ప్రమేయం…?
ఈ వ్యవహారంలో స్థానికంగా ప్రభావం కలిగిన ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రేషన్ డీలర్లు, మధ్యవర్తులు, వ్యాపార వర్గాలకు చెందిన కొందరు కలిసి ఈ అక్రమ దందాను నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై అధికారులు అధికారికంగా ఎలాంటి పేర్లు వెల్లడించలేదు. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
బండి భగీరథ్కు దక్కని ఉరట.. హై కోర్టు కీలక నిర్ణయం..!
పేదల బియ్యం మళ్లింపు..?
ప్రభుత్వం పేదల కోసం తక్కువ ధరకే పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది దళారులు సేకరించి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న ఘటనలు ఇటీవల పలుచోట్ల వెలుగుచూస్తున్నాయి. ఇదే తరహాలో మరిపెడ ఘటన కూడా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి, వాటిని పెద్ద ఎత్తున నిల్వ చేసి ఇతర రాష్ట్రాలకు తరలించే ముఠాలు పనిచేస్తున్నాయనే అనుమానాలు ఉన్నాయి.
కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం
పట్టుబడిన బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకొని సంబంధిత గోదాములకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది..? ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు..? ఇంకా ఎక్కడైనా నిల్వలు ఉన్నాయా..? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశముందని సమాచారం. ఒక్కసారిగా భారీగా రేషన్ బియ్యం పట్టుబడడంతో మరిపెడ పట్టణంలో చర్చనీయాంశమైంది. సాధారణ ప్రజలకు అందాల్సిన బియ్యం అక్రమ మార్గాల్లో మళ్లింపుకు గురవుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Anchor Varshini : వర్షిణి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? హీరోయిన్ల కన్నా ఎక్కువే..

