PACS Boards: స్వేచ్ఛ బ్యూరో: పీఏసీఎస్ పాలకవర్గాల వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలు కీలక మలుపు తిప్పాయి. 2025 ఫిబ్రవరి 14న ఎక్స్టెన్షన్ పొందిన పాలకవర్గాలు తిరిగి పదవీ బాధ్యతలు చేపట్టాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.597ను ఉపసంహరించుకోవడంతో పాత పాలకవర్గాలు మళ్లీ బాధ్యతలు స్వీకరించాయి.
ఇటీవల ప్రభుత్వం పీఏసీఎస్ పాలకవర్గాలను రద్దు చేస్తూ, వాటి స్థానంలో పర్సన్ ఇన్చార్జులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయంపై వివాదం నెలకొనడంతో హైకోర్టును ఆశ్రయించారు.
దుబ్బాక నియోజకవర్గ పరిధిలో..
ఈ నేపథ్యంలో కోర్టు ఎక్స్టెన్షన్ పొందిన పాలకవర్గాలు తిరిగి బాధ్యతలు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. దాంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ జీఓ 597ను ఉపసంహరించుకుంది. ఈ పరిణామాలతో దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని పీఏసీఎస్లలో పాత పాలకవర్గాలు తిరిగి బాధ్యతలు చేపట్టడం ప్రారంభించాయి. దుబ్బాక పీఏసీఎస్ చైర్మన్గా షేర్ల కైలాసం, మిరుదొడ్డి పీఏసీఎస్లో లింగాల రాజలింగారెడ్డి, దౌల్తాబాద్లో వెంకట్ రెడ్డి, తొగుటలో హరికిషన్ రెడ్డి, చేగుంటలో బోనగిరి బాగులు, రెడ్డిపల్లిలో మేకల పరమేష్ తమ తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు.పాలకవర్గాల పునరుద్ధరణతో సహకార రంగంలో స్థిరత్వం నెలకొంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్కు గవర్నర్ షాక్.. మ్యాజిక్ నంబర్ ఎక్కడ?
భవిష్యత్తులో..
ముఖ్యంగా రుణాల మంజూరు, వ్యవసాయ అవసరాల సమన్వయం, మార్కెటింగ్ సౌకర్యాల కల్పన వంటి అంశాలు మళ్లీ వేగం పుంజుకుంటాయని భావిస్తున్నారు.
అదేవిధంగా, సహకార సంఘాల పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం కొనసాగించాలని పలువురు రైతు నాయకులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిపాలనా అనిశ్చితులు తలెత్తకుండా ప్రభుత్వం స్పష్టమైన విధానాలు రూపొందించాలని కోరుతున్నారు.

