Virender Sehwag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో… మరోవైపు ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వన్డే సిరీస్ ఇవాళ షురూ కానుంది.
అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ( Pakistan Cricket Board) కీలక సూచనలు చేశారు టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. కొత్త కోచ్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెతుకుతున్న నేపథ్యంలో… షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ పేర్లను ప్రస్తావిస్తూ.. వాళ్లను కోచ్ లుగా పెట్టుకోండి అంటూ సూచనలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు విదేశీ కోచ్ లు అస్సలు సెట్ కారని వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) వెల్లడించారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది ( Shahid Afridi), షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) ఇద్దరినీ వెంటనే కోచ్ లుగా నియమిస్తే… ఆ జట్టు చాలా బలంగా తయారవుతుందని వెల్లడించారు. తమ దేశంలోనే ఆణిముత్యాలను పెట్టుకొని.. పక్క దేశం కోసం వెళ్లడం దండగ అంటూ చురకలు అంటించారు.
అఫ్రిది, అక్తర్ లను కోచ్ లుగా పెట్టుకోండి – వీరేంద్ర సెహ్వాగ్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత కొన్ని రోజులుగా దారుణంగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న కోచ్ లు అందరిని పక్కకు పెట్టాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే కొత్త వారి కోసం ప్రయత్నాలు చేపడుతోంది. అయితే ఇలాంటి క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ అదిరిపోయే ఐడియా ఇచ్చారు. విదేశీ క్రికెటర్లు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అస్సలు పనికిరారని వివరించారు. పాకిస్తాన్ లోనే అద్భుతమైన ఆటగాళ్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ ఇద్దరు ఉన్నారని.. ఆ ఇద్దరిని బ్యాటింగ్ అలాగే బౌలింగ్ కోచ్ లుగా నియామకం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఆ దిశగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అడుగులు వేయాలన్నారు. ఒకప్పుడు షాహిద్ అఫ్రిది చిచ్చర పిడుగుల బౌలర్లపై దూకుడుగా వ్యవహరించాడని.. అలాంటి ఆటగాడు బ్యాటింగ్ కోచ్ గా ఉంటే, ఫలితాలు 200% వస్తాయని స్పష్టం చేశారు. ఇక అత్యంత భయంకరంగా బౌలింగ్ చేసే షోయబ్ అక్తర్, బౌలింగ్ కోచ్ గా పాకిస్తాన్ ను తట్టుకోవడం చాలా కష్టమే. వాళ్ళిద్దరూ రంగంలోకి దిగితే, పాకిస్తాన్ క్రికెట్ జట్టు అత్యంత ప్రమాదకరంగా మారే ఛాన్సులు ఉన్నట్లు వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత మంచి ఆటగాళ్లు ఉండగా.. తెలివి తక్కువ తనంతో విదేశీ కోచ్ లు అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జపం చేస్తోందని మండిపడ్డారు.
కుమార సంగక్కర, హెడెన్ లకు ఛాన్స్
పాకిస్తాన్ జట్టుకు విదేశీ కోచ్ కావాలన్న లక్ష్యంతో ఇప్పటికే కుమార సంగక్కర, హెడెన్ ల పేర్లను పరిశీలనలో పెట్టింది PCB. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అవుతారని చర్చ జరుగుతోంది. ఇద్దరు ఐపీఎల్ లో బిజీగా ఉన్నారు. ఆ టోర్నమెంట్ అయిపోగానే చర్చలు జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతలోనే వీరేంద్ర సెహ్వాగ్ పై సూచనలు చేశారు.
https://www.facebook.com/reel/1533815934965246

