Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శాంతించిన దిల్లీ.. నిరసనలు విరమణ.. తిరిగి ప్రారంభమైన మెట్రో స్టేషన్లు!

శాంతించిన దిల్లీ.. నిరసనలు విరమణ.. తిరిగి ప్రారంభమైన మెట్రో స్టేషన్లు!

Big TV Live 10 hrs ago

Pradhan Resignation: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో పెరిగిన ఒత్తిడి.. కేంద్ర నిఘా వర్గాలు అందించిన నివేదిక నేపథ్యంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ తన పదవికి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది.

కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల సలహా మేరకే ఆయన రిజైన్ చేశారని సమాచారం. మరోవైపు ప్రధాన్ రాజీనామాతో గత కొద్ది రోజులుగా నిరసనలతో అట్టుడికిన దిల్లీలో ప్రస్తుతం వాతావరణం శాంతించింది. విద్యార్థులు నిరసనలను విరమించడంతో మెట్రో స్టేషన్లు సైతం తిరిగి ప్రారంభమయ్యాయి.

నిఘా వర్గాల నివేదిక..

దిల్లీలో సీజేపీ, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి కీలక నివేదిక అందినట్టు తెలుస్తోంది. ఒక స్పష్టమైన లక్ష్యంతో కాక్రోచ్ జనతా పార్టీ​ సాగిస్తున్న నిరసనల్లోకి అసాంఘిక శక్తులు చొరబడ్డాయన్నది ఆ నివేదిక సారాంశమని తెలిసింది. బంగ్లాదేశ్​, నేపాల్​ తదితర దేశాల్లో జరిగినట్టుగా ఇక్కడ కూడా మా సత్తా చూపుతామంటూ కొందరు మీడియాతో చెప్పిన వీడియోలను సేకరించిన నిఘా వర్గాలు వాటిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అందచేశాయి.

హోంశాఖకు హెచ్చరిక

ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే దేశం మొత్తం హింస చెలరేగే ప్రమాదముందని కేంద్ర హోంశాఖను నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయటం, దానికి ప్రభుత్వ పెద్దలు అంగీకరించటం వెంట వెంటనే జరిగిపోయాయని నిఘా వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

వారిపై చట్టపరమైన చర్యలు

అయితే కాక్రోచ్​ జనతా పార్టీ జరిపిన నిరసనల్లోకి చొరబడి పోలీసులపై దాడులు చేసినవారు.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసు వర్గాలు తేల్చి చెబుతున్నాయి. శాంతియుతంగా నిరసనలు చేసిన వారిపై ఒకవేళ కేసులు నమోదైతే వాటిని మాత్రం ఎత్తి వేస్తామని స్పష్టం చేశాయి. నిరసనకారుల ముసుగులో హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై మాత్రం వదిలిపెట్టమని పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు.

నిందితుల కోసం ఫోటో మ్యాపింగ్

ఇప్పటికే నిఘా వర్గాలు ఘర్షణలు చెలరేగిన రోజున రికార్డు చేసిన వీడియో క్లిప్పింగులను సేకరించినట్టుగా తెలిసింది. ఫోటో మ్యాపింగ్​ ద్వారా వాటిల్లో ఉన్న పాత నేరస్తులు, వేర్వేరు చట్టాల ప్రకరం నమోదైన నిందితులు, అసాంఘిక శక్తులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించాయి. ఈ క్రమంలో పలువురిని గుర్తించినట్టుగా కూడా తెలుస్తోంది.

తెరుచుకున్న మెట్రో స్టేషన్లు

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ రాజీనామాతో ఆందోళనలను విరమిస్తున్నట్టు కాక్రోచ్​ జనతా పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దిల్లీలో మూసేసిన మెట్రో రైల్​ స్టేషన్లు తిరిగి తెరుచుకున్నాయి. ఇటీవల చెలరేగిన హింసతో దిల్లీ మెట్రో రైల్​ కార్పోరేషన్​ అధికారులు 17 స్టేషన్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మూసివేసిన వాటిలో సుప్రీం కోర్టు స్టేషన్ కూడా ఉంది. దీనిపై స్పందించిన చీఫ్​ జస్టిస్​.. సుప్రీం కోర్టు ఉద్యోగులు, ప్రాక్టీస్​ చేస్తున్న న్యాయవాదుల రాకపోకలకు వీలుగా స్టేషన్లను తెరవాలని ఆదేశించింది. తాజాగా నిరసనల విరమణల నేపథ్యంలో ప్రస్తుతం అన్ని మెట్రో స్టేషన్లు తెరుచుకున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live