New Simple Energy Showrooms Open: ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న సింపుల్ ఎనర్జీ, దేశ వ్యాప్తంగా తన వ్యాపారాన్ని మరింత విస్తరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది.
తాజాగా ఈ కంపెనీ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కొత్త షోరూమ్లను ప్రారంభించింది. ఢిల్లీ, నాసిక్, ఔరంగాబాద్, సిలిగురి లాంటి నగరాల్లో మొత్తం ఐదు కొత్త డీలర్ షిప్ లను ప్రారంభించడం ద్వారా, వినియోగదారులకు మరింత చేరువ కావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
పలు నగరాల్లో కొత్త షోరూమ్ లు
ప్రత్యేకంగా ఢిల్లీలో కంపెనీ రెండు వేర్వేరు ప్రాంతాల్లో షోరూమ్లను ప్రారంభించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న కస్టమర్లను సులభంగా చేరుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా వినియోగదారులకు మరింత సౌలభ్యం కలగనుంది. అదేవిధంగా, మహారాష్ట్రలోని నాసిక్ మరియు ఔరంగాబాద్ నగరాల్లో కూడా కొత్త అవుట్లెట్లను ప్రారంభించడం ద్వారా, పశ్చిమ భారతంలో తన ఉనికిని చాటుకునేందుకు కంపెనీ భావిస్తోంది. ఈ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, సింపుల్ ఎనర్జీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది.
అటు మరో షో రూమ్ ను సిలిగురిలో ప్రారంభం అయ్యింది. ఇది పూర్తి స్థాయి 3S(సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్) కేంద్రంగా పని చేస్తుంది. వాహనం కొనుగోలు నుంచి సర్వీస్ వరకు అన్ని సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
కొత్త షో రూమ్ లలో లేటెస్ట్ మోడల్స్
ఈ కొత్త షోరూమ్ లలో కంపెనీ తమ తాజా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లను ప్రదర్శిస్తోంది. ఇందులో సింపుల్ వన్ జెన్ 2, సింపుల్ వన్ ఎస్ జెన్ 2 లాంటి మోడళ్లు ఉన్నాయి. సింపుల్ వన్ జెన్ 2 రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. ఒకటి 4.5kWh బ్యాటరీ, ఇది సుమారు 236 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. మరొకటి 5kWh బ్యాటరీ, ఇది 265 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
ఇక సింపుల్ వన్ ఎస్ జెన్ 2 విషయానికి వస్తే, ఇది కొంచెం తక్కువ ధరలో లభించే మోడల్. అయినప్పటికీ, ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 190 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.
దేశ వ్యాప్తంగా 40 అవుట్ లెట్లు
ప్రస్తుతం సింపుల్ ఎనర్జీ దేశ వ్యాప్తంగా 38కి పైగా నగరాల్లో దాదాపు 70 అవుట్లెట్లను నిర్వహిస్తోంది. కంపెనీ మరింత విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలోనే నాగ్ పూర్, రాంచీ, భువనేశ్వర్ లాంటి నగరాల్లో కూడా కొత్త షోరూమ్ లను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సింపుల్ ఎనర్జీ తీసుకుంటున్న ఈ విస్తరణ చర్యలు, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచే దిశగా ఒక మంచి సంకేతంగా భావించవచ్చు. కొత్త నగరాల్లో సేవలను అందించడం ద్వారా, కంపెనీ తన వినియోగదారుల సర్కిల్ ను విస్తరించడమే కాకుండా, EV మార్కెట్ లో తన స్థానం మరింత బలోపేతం చేసుకుంటుంది.
Read Also: పల్సర్ లవర్స్ కు గుడ్ న్యూస్, మరింత చౌకగా అందుబాటులోకి!

