Kondareddypalli: స్వేచ్ఛ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ బుధవారం ఉదయం పర్యటించారు.
ఇందులో భాగంగా కొండారెడ్డిపల్లి గ్రామంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న పనుల పురోగతి, ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలు పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు.
టెస్టింగ్ విధానాలపై వివరాలు..
గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఏటీసీ సెంటర్కు అవసరమైన 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఏటీసీ నిర్మాణంతో పాటు ప్రత్యేక మోడల్ స్కూల్ నిర్మాణానికి అవసరమైన స్థలాలపై అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం గ్రామంలో ఆధునిక సదుపాయాలతో ఇటీవల ప్రారంభించిన మిల్క్ సెంటర్ను సందర్శించిన కలెక్టర్, పాల ఉత్పత్తిదారులకు అందుతున్న సేవలు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పాల సేకరణ, టెస్టింగ్ విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పశువైద్య కేంద్రాన్ని తనిఖీ చేసి పశుసంవర్థక సేవలు గ్రామస్థులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆధునిక హంగులతో..
గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆధునిక హంగులతో నిర్మిస్తున్న పాఠశాల భవనం, ఆరోగ్య కేంద్రం త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంప్ పనులను పరిశీలించిన కలెక్టర్, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని సూచించారు. అండర్ డ్రైనేజ్ నీటిని శుద్ధి చేసే విధంగా నిర్మిస్తున్న శుద్ధి కేంద్రాన్ని పరిశీలించి, గ్రామాల పారిశుద్ధ్య పరిస్థితుల మెరుగుదల ప్రజారోగ్యానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు.
Also read: మరీ ఇంత దారుణమా? న్యాయం కోసం వెళ్లిన వివాహిత పై సీఐ..?
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
గ్రామాల సమగ్రాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్, విద్య, వైద్య సేవల వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని అధికారులను హెచ్చరించారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేలా ఉండాలని, పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించిన కలెక్టర్, గ్రామాభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని పేర్కొన్నారు. అధికారులు గ్రామస్థులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.
కలెక్టర్ దేవ సహాయం..
అంతకుముందు కలెక్టర్ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు కలెక్టర్కు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ దేవ సహాయం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి విజయకుమార్, డీఈఓ రమేష్ కుమార్, డివిజన్ మరియు మండల స్థాయి అధికారులు గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Also read: BAN VS PAK: పాకిస్తాన్ ఘోర ఓటమి..టెస్టు సిరీస్ వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్

