Rajinikanth Vijay: తమిళనాడు రాజకీయాలు, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై సూపర్ స్టార్ రజనీకాంత్ తొలిసారి నోరు విప్పారు. చెన్నై పోయెస్ గార్డెన్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడంపై తన స్పందనను తెలియజేస్తూనే, డీఎంకే నేత ఎం.కె. స్టాలిన్తో తనకున్న స్నేహాన్ని సమర్థించుకున్నారు.
విజయ్ సీఎం అవ్వడం..
విజయ్ ముఖ్యమంత్రి కావడంపై రజనీకాంత్ మాట్లాడుతూ.. ఆ వార్త వినగానే తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. 'నేను రాజకీయాల నుండి తప్పుకుని చాలా కాలం అయ్యింది. విజయ్కి, నాకు మధ్య దాదాపు 28 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. రాష్ట్రంలోని రెండు ప్రధాన పాత రాజకీయ పార్టీలను ఎదుర్కొని, విజయ్ తన స్వశక్తితో ఈ స్థాయికి చేరుకోవడం, సీఎం కావడం నిజంగా విశేషం' అని రజనీకాంత్ ప్రశంసించారు.
అలాగే, ఎయిర్పోర్టులో విజయ్ను తాను అభినందించలేదనే విమర్శలపై స్పందిస్తూ.. విజయ్ గెలవగానే తాను ‘X’ (ట్విట్టర్) వేదికగా అభినందనలు తెలిపానని గుర్తుచేశారు. తాను రాజకీయాల్లో లేనప్పుడు విజయ్పై ఈర్ష్య పడాల్సిన అవసరం తనకు లేదని, ఎవరికి ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుందని వ్యాఖ్యానించారు.
స్టాలిన్తో స్నేహం..
ఎన్నికల ఫలితాల అనంతరం డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ను కలవడంపై వస్తున్న విమర్శలను రజనీకాంత్ తీవ్రంగా ఖండించారు. మా మధ్య ఉన్న స్నేహం ఇప్పటిది కాదు, అది రాజకీయాలకు అతీతమైనది. కొలత్తూరు నియోజకవర్గంలో ఎం.కె. స్టాలిన్ ఓడిపోవడం నాకు వ్యక్తిగతంగా బాధ కలిగించింది. ఆ బాధతోనే నేను ఆయన్ను కలిశాను. అనవసరమైన రాజకీయ విషయాల గురించి మాట్లాడటానికి రజనీకాంత్ అంత చౌకబారు వ్యక్తి కాదు.
తనపై వస్తున్న పుకార్లకు, విమర్శలకు సమాధానం ఇవ్వకపోతే ప్రజలు వాటినే నిజాలని నమ్మే ప్రమాదం ఉందని, అందుకే తాను మీడియా ముందుకు రావలసి వచ్చిందని రజనీకాంత్ స్పష్టం చేశారు. ఈ సమావేశంతో తనపై వస్తున్న అన్ని రూమర్లకు ఆయన ఒక్కసారిగా తెరదించారు.

