Film Chamber: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు మరియు థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య తలెత్తిన సమస్యల పరిష్కారానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రంగంలోకి దిగింది.
ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు ఆధ్వర్యంలో నేడు ఇరు వర్గాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రధానాంశాలు
ఈ సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరగనున్నాయి.
పర్సంటేజ్ విధానం: సినిమా వసూళ్లలో వాటాల పంపిణీపై స్పష్టత.
రెంటల్స్ : థియేటర్ల నిర్వహణ మరియు అద్దె భారంపై చర్చ.
OTT విండో: సినిమా థియేటర్లలో విడుదలైన ఎన్ని రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వాలనే నిబంధనపై ఒక నిర్ణయానికి రావడం.
హాజరయ్యే సభ్యులు
పరిమిత సంఖ్యలో సభ్యులతో ఈ చర్చలు నిర్వహించనున్నారు. మొత్తం 10 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు. ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు. గిల్డ్ నిర్మాతల తరపున ముగ్గురు కీలక ప్రతినిధులు. ఫిలిం ఛాంబర్ ముఖ్య సభ్యులు.
Read also-అకాష్ అంబానీపై పంజాబ్ ఫ్యాన్స్ దాడి…ముఖంపైన ఫోన్లు విసిరేసి మరీ !
పరిష్కారం దిశగా అడుగులు
గత కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ముదిరి, వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లడంతో పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు ఛాంబర్ ఈ చొరవ తీసుకుంది. “నేడు జరిగే చర్చలలో ఎగ్జిబిటర్లు మరియు నిర్మాతల మధ్య ఉన్న అన్ని సమస్యలకు సానుకూల పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాం.” అని ప్రముఖ నిర్మాత సీ. కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పరిశ్రమ ప్రయోజనాల దృష్ట్యా ఇరు వర్గాలు పట్టువిడుపులతో వ్యవహరించి, ఒక ఏకాభిప్రాయానికి వస్తారని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చర్చల అనంతరం పరిశ్రమలో నెలకొన్న అనిశ్చితికి తెరపడే అవకాశం ఉంది.

