Khammam: స్వేచ్ఛ బ్యూరో: ఖమ్మం జిల్లా కొన్ని తహసీల్దార్ కార్యాలయాల పనితీరు ప్రస్తుతం తీవ్ర విమర్శలకు గురవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు కాని వ్యక్తులు "జీపీఓ అసిస్టెంట్లు", "ఏఎస్ఓ అసిస్టెంట్లు" పేర్లతో కార్యాలయాల్లో చలామణి అవుతూ.
అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.వేంసూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు ఫైళ్లు హ్యాండిల్ చేయడం, ప్రజల దరఖాస్తులపై ప్రభావం చూపించడం, ఎవరికి ముందుగా పని చేయాలి… ఎవరిని తిప్పాలి… అనే స్థాయిలో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అదేవిధంగా సత్తుపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తి ఒకేసారి జీపీఓ అసిస్టెంట్గా, మరోవైపు ఏఎస్ఓ అసిస్టెంట్గా కొనసాగుతూ కార్యాలయంలో ప్రత్యేక ప్రభావం చూపుతున్నాడనే చర్చ నడుస్తోంది. ఓ గ్రామ వీఆర్ఏ కుమారుడు అదే కార్యాలయంలో కీలక వ్యవహారాల్లో తిరుగుతుండడం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది.
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకా… లేక పరిచయాలకా ప్రాధాన్యం..?
సామాన్య ప్రజలు చిన్న పని కోసం రోజుల తరబడి తిరుగుతుంటే కొందరికి మాత్రం నిమిషాల్లో ఫైళ్లు క్లియర్ అవుతున్నాయనే ఆరోపణలు తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తున్నాయి. "ఎవరికి దగ్గర వాళ్లు అయితే వాళ్ల పనులే ముందుగా జరుగుతున్నాయి" అనే విమర్శలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.
Also read: తెలంగాణ భూభాగంలో.. మరాఠా మాఫియా అరాచకం..!
అధికారుల కంటే ప్రైవేట్ వ్యక్తులే పవర్ఫుల్నా..?
కార్యాలయాల్లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అధికారుల తరహాలో వ్యవహరిస్తూ ప్రజలతో మాట్లాడటం, ఫైళ్లు తీసుకోవడం, సూచనలు ఇవ్వడం వంటి చర్యలు చేయడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. "అసలు తహసీల్దార్ కార్యాలయం ప్రభుత్వదా లేక కొందరి వ్యక్తిగత వ్యవస్థలా నడుస్తోందా..?" అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సబ్ కలెక్టర్ వెంటనే స్పందించాలి..
గతంలో కల్లూరు సబ్ కలెక్టర్ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పరిస్థితుల్లో మార్పు కనిపించకపోవడంతో ఇప్పుడు ఈ వ్యవహారాన్ని సబ్ కలెక్టర్ సీరియస్గా తీసుకుని విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల జోక్యానికి చెక్ పెట్టకపోతే… ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Also read: కృత్రిమ మేధతో సోషల్ మీడియాపై నిఘా.. పోలీసుల చేతికి కొత్త అస్త్రం!

