Bandi Sanjay: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల మధ్య ప్రాంతీయ.. భాషా బేధాలు సృష్టించి విభజన రాజకీయాలకు పాల్పడిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.
స్టాలిన్కు అక్కడి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని ఆయన విమర్శించారు. ఉత్తరాది, దక్షిణాది అనే విభజన రేఖలు గీసి విషం చిమ్మే ప్రయత్నం చేసిన వారికి ఈ ఫలితాలు ఒక హెచ్చరిక అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అభివృద్ధిని చూసి దేశం మొత్తం ఎన్డీయే (NDA) వైపు మొగ్గు చూపుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ ఫలితాలపై బండి సంజయ్ ప్రత్యేకంగా స్పందించారు. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ సాధిస్తున్న విజయం చారిత్రాత్మకమని కొనియాడారు. “బెంగాల్లో మా గెలుపు కోసం దేశవ్యాప్త కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. అక్కడ బంగ్లాదేశ్ గుండాల చేతుల్లో మా కార్యకర్తలు బలిదానమయ్యారు.. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అక్రమ చొరబాటుదారులు ఈ దేశంలోకి వచ్చి బాంబులు పెట్టి.. విద్వంసం సృష్టించి.. అక్రమంగా ఓట్లు వేయడాన్ని దేశ ప్రజలు ఎన్నటికీ సహించరు,” అని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం చొరబాటుదారుల పాలిట సింహస్వప్నమని.. ఈ ఫలితాలతో ఇండియా కూటమి గాలిలో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు.
కేరళ ఫలితాలపై స్పందిస్తూ.. అక్కడ అధికార కమ్యూనిస్టు ప్రభుత్వంపై ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకత వల్లే యూడీఎఫ్ (UDF) లాభపడిందని సంజయ్ అన్నారు. అది కేవలం అధికార మార్పిడి మాత్రమే తప్ప.. మరోటి కాదని కొట్టిపారేశారు. బెంగాల్లో బీజేపీ కొత్తగా పుంజుకోవడం అనేది రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా రాబోయే మార్పుకు సంకేతమని చెప్పారు. భవిష్యత్తులో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ డబుల్ ఇంజన్ సర్కార్లు ఏర్పడబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే ఈ విజయాలకు పునాది అని బండి సంజయ్ స్పష్టం చేశారు. అక్రమ చొరబాటుదారులు.. దేశ వ్యతిరేక శక్తులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు. బెంగాల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని.. బలిదానమైన కార్యకర్తల ఆత్మలకు ఈ విజయం శాంతిని చేకూరుస్తుందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. బీజేపీ ఇకపై దక్షిణాదిలోనూ తన పట్టును మరింత బిగించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

