Pension Verification: స్వేచ్ఛ బ్యూరో: పెన్షన్లలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వాటికి చెక్ పట్టే చర్యలు చేపట్టింది. అనర్హులకు, మృతిచెందిన వారి పేరసైతం పెన్షన్లు డ్రా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో పెన్షన్ దారులు లైవ్ నెస్ అథెంటికేషన్ తోనే పింఛన్ డబ్బులు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా మంచానికి పరిమితం అయిన వృద్ధులకు సైతం డోర్ స్టెప్ ధృవీకరణతో పెన్షన్లు ఇవ్వనున్నారు. అంతేకాదు మృతిచెందిన వారి పేర్ల ను గ్రామసభ, వార్డు సభ ఆమోదంతో తొలగింపు చర్యలు చేపట్టబోతున్నారు. దీంతో పెన్షన్ లు అర్హులకే అందనున్నాయి.
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో పారదర్శకత, బాధ్యతాయుత పాలనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. చేయూత పథకం కింద తమ బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులకు 'లైవ్నెస్ ఆథెంటికేషన్' అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులకు మాత్రమే పింఛన్ డబ్బులు ఇవ్వలనే లక్ష్యంతో ఈ ప్రక్రియను పకడ్బందీగా చేపడుతోంది. దీనికి సంబంధించి కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్డీఓ లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో సుమారు 42,08,129 మంది పింఛన్ దారులున్నారు. ఇందులో ఎక్కువగా 14,95,320 మంది వృద్ధులు, 15,09.793 మంది వితంతువులు పింఛన్లు తీసుకుంటున్నారు.
గ్రామసభ ఆమోదం తప్పనిసరి..
మృతుల పేర్లపై అనధికారికంగా పెన్షన్లు విడుదలను నివారించడం, అర్హులైన పేదలకు న్యాయం చేయడం, పెన్షన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడం ఈ నిర్ణయంతో సాధ్యమవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో 10 సంవత్సరాల క్రితమే మరణించిన వారి పేర్లపై కూడా పెన్షన్లు కొనసాగుతున్నాయంటూ పలు వార్తాకథనాలు వస్తున్న తరుణంలో వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంది.లబ్ధిదారుల జాబితా నుంచి మరణించిన వారి పేర్లను తొలగించే ముందు గ్రామసభ ఆమోదం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో నిజమైన లబ్ధిదారులకు ఎలాంటి అన్యాయం జరగకుండా, పూర్తి పారదర్శకతతో ప్రక్రియ కొనసాగనుంది.
బీజేపీలో భగీరథ్ ప్రకంపనలు.. సొంత పార్టీలో వినిపిస్తున్న అసమ్మతి స్వరం.. డైలమాలో కీలక నేతలు!
లైవ్నెస్ ఆథెంటికేషన్..
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా సామాజిక భద్రతా పెన్షన్లకు లైవ్ అథెంటికేషన్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తూ ముందడుగు వేసింది. ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ (ఎఫ్ఆర్ఎస్), బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ సాంకేతికతతో ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల నూతన పెన్షన్ల మంజూరుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలో కొత్త అర్హుల గుర్తింపు ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఏ ఒక్క అర్హుడు నష్టపోకుండా, అనర్హులకి లబ్ధి జరగకుండా ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న లైవ్నెస్ ఆథెంటికేషన్ ద్వారా వాస్తవ లబ్ధిదారుల గుర్తింపు సులభమవడంతో పాటు కొత్త అర్హులకు అవకాశాలు కల్పించేందుకు మార్గం సుగమం కానుంది.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం..
గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. వృద్ధులు, మంచానికే పరిమితమైన వారు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ డోర్ స్టెప్ ధృవీకరణ చేపట్టాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలుఇచ్చింది. మే 15 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియను జూన్ 15 నాటికి తొలి దశలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ, లీకేజీలను అరికడుతూ నిజమైన అర్హులకు చేరేలా సాంకేతికతను వినియోగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఏది ఏమైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిజమైన లబ్దిదారులకే పెన్షన్ అందనుంది.

