Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉద్యమకారుల గడ్డపై కాంగ్రెస్‌కు కవిత ఓపెన్ ఛాలెంజ్.. ఇంటి స్థలాలు ఇచ్చేదాకా వదిలిపెట్టం

ఉద్యమకారుల గడ్డపై కాంగ్రెస్‌కు కవిత ఓపెన్ ఛాలెంజ్.. ఇంటి స్థలాలు ఇచ్చేదాకా వదిలిపెట్టం

Big TV Live 1 week ago

Telangana: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని నాచారం ఇండస్ట్రియల్ ఏరియా, బోడుప్పల్ ప్రాంతాలు ఒక్కసారిగా రణరంగాన్ని తలపించాయి. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం 'తెలంగాణ రక్షణ సేన' (TRS) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తలపెట్టిన 'భూ పోరాటం' తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనే డిమాండ్‌తో పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాటలో కల్వకుంట్ల కవితకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ పరిణామం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

అసలు వివాదం ఏంటి? ఎందుకు ఈ పోరాటం?
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన నిరుపేద ఉద్యమకారులకు గతంలో ఇచ్చిన హామీల చుట్టూనే ఈ వివాదం తిరుగుతోంది. ఉప్పల్ భగాయత్ పరిధిలో అర్హులైన ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ రక్షణ సేన కాలంగా డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన ఈ కీలకమైన హామీని విస్మరించిందని, వారి సమస్యలను పట్టించుకోవడం లేదని సదరు పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ హక్కులను సాధించుకోవడానికి ఉద్యమకారులు ప్రత్యక్ష పోరాటానికి దిగాల్సి వచ్చింది.

రక్షణ కాలనీగా నామకరణం..
పోరాటంలో భాగంగా ఉద్యమకారులు బోడుప్పల్, నాచారం సరిహద్దుల్లోని వివాదాస్పద స్థలంలో తాత్కాలికంగా టెంట్లు వేసి నిరసనకు కూర్చున్నారు. అంతేకాకుండా, ఆ ప్రాంతానికి “తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీ” గా నామరణం చేశారు. ఉద్యమకారుల్లో స్థైర్యాన్ని నింపేందుకు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత స్వయంగా అక్కడ ‘బొడ్రాయి’ ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ స్థిరనివాసానికి ఇదే తొలి అడుగు అని వారు ప్రకటించడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

పోలీసుల రంగప్రవేశం..
ఈ భూపోరాట కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు అనుమతులు లేవంటూ పోలీసులు రంగంలోకి దిగారు. ఉద్యమకారులు వేసిన టెంట్లను, షెడ్లను పోలీసులు బలవంతంగా తొలగించడంతో ఉద్రిక్తత పీక్‌ స్టేజ్‌కు చేరింది. పోలీసుల చర్యను తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు, ఉద్యమకారులు తీవ్రంగా నిరోధించారు. ఫలితంగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసేందుకు పోలీసులు అక్కడ ఉన్నవారందరినీ చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేశారు.

అరెస్టుల పర్వం..
అయితే పరిస్థితి చేదాటిపోతుండటంతో పోలీసులు కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది టీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను, ఉద్యమకారులను ఉక్కుపాదంతో అణచివేసి అరెస్ట్ చేశారు. వారిని ప్రత్యేక వాహనాల్లో బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. “ఉద్యమకారుల రక్తాన్ని కళ్లజూసిన అరాచక కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తే ఊరుకోం. 250 గజాల ఇంటి స్థలం ఇచ్చే వరకు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ మోసాలను ఎండగడుతూనే ఉంటాం” అని హెచ్చరించారు. ఈ అరెస్టులతో ఉప్పల్, బోడుప్పల్ పరిసర ప్రాంతాల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live