Dailyhunt
ఉద్యోగాల్లో భారీ కుట్ర.. జీవోల పేరుతో నిరుద్యోగుల గొంతు కోస్తున్నారు: కవిత

ఉద్యోగాల్లో భారీ కుట్ర.. జీవోల పేరుతో నిరుద్యోగుల గొంతు కోస్తున్నారు: కవిత

Big TV Live 1 month ago

తెలంగాణలో డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల నియామకాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

బుధవారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రూప్-1 తరహాలోనే తమకు కావలసిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి వీలుగా జీవో నంబర్ 4ను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. పీహెచ్‌డీ అభ్యర్థులకు ఏకంగా 25 మార్కుల వెయిటేజీ ఇవ్వడం వెనుక కుట్ర దాగి ఉందని విమర్శించారు. పీహెచ్‌డీ అడ్మిషన్లే సక్రమంగా లేని పరిస్థితుల్లో ఇంత భారీ వెయిటేజీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు దక్కకుండా ప్రభుత్వం ప్రతి నోటిఫికేషన్‌కు ఒక జీవోను అడ్డు పెడుతోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు జీవో 104, గ్రూప్స్ అభ్యర్థులకు జీవో 29, పోలీసు నియామకాల్లో జీవో 46, గురుకులాలకు జీవో 81 శాపంగా మారాయని వివరించారు. ఈ వివాదాస్పద జీవోలను వెంటనే రద్దు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత మూడు ఏళ్లుగా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) నిర్వహించకపోవడం వల్ల వేలాది మంది అర్హులైన నిరుద్యోగులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న నిబంధనలు కేవలం అధికార పార్టీకి అనుకూలమైన వారికి మేలు చేసేలా ఉన్నాయని దుయ్యబట్టారు.

మూసీ ప్రక్షాళనకు 7 వేల కోట్లు కేటాయించే ప్రభుత్వానికి.. నిరుద్యోగుల సమస్యలపై సమీక్ష చేసే తీరిక లేదా అని కవిత నిలదీశారు. రాహుల్ గాంధీతో హామీలు ఇప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు జాబ్ క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఫీజు రీయింబర్స్ మెంట్, అంగన్ వాడీ జీతాలు, గర్భిణీలకు ఇచ్చే ఆర్థిక సాయం నిలిచిపోయాయని ఆరోపించారు. ప్రభుత్వం తన ధోరణి మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు.

రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కవిత తీవ్రంగా తప్పుబట్టారు. కొత్త కార్డులు ఇస్తామని చెప్పి.. ఉన్న కార్డులను ఏరివేసే కార్యక్రమం పెట్టుకోవడం పైశాచికమని విమర్శించారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారనే సాకుతో దాదాపు 15 లక్షల కార్డులను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని చెప్పారు. పేదల నోటి కాడ కూడు తీసే పనులు మానుకోవాలని సూచించారు. కొండగట్టు అంజన్న ఆలయంలో జరిగిన ప్రమాదంపై స్పందిస్తూ.. అధికారుల నిర్లక్ష్యం వల్లే భక్తులు గాయపడ్డారని మండిపడ్డారు. నాసిరకం పందిళ్లు వేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live