Excise Raids: స్వేచ్ఛ బ్యూరో: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఎక్సైజ్ శాఖ చర్యలు వివాదాలకు కేంద్రంగా మారాయి. గూడూరు, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో బెల్ట్ షాపులపై ఇటీవల నిర్వహించిన దాడులు, అనంతరం యజమానులను హనుమకొండ ఎక్సైజ్ కార్యాలయానికి హాజరుకావాలని జారీ చేసిన ఆదేశాలు అనుమానాలకు తావిస్తున్నాయి.
ఎంఆర్పీ ధరలకు మద్యం కొనుగోలు చేసి స్వల్ప లాభంతో విక్రయిస్తున్న వ్యాపారులపైనే చర్యలు తీసుకోవడం వెనుక సిండికేట్ ఒత్తిడి ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
అధిక ధరలకు విక్రయాలు
మండలంలోని ఆరు మద్యం దుకాణాలు సిండికేట్గా ఏర్పడి గ్రామాలను పంచుకుని వ్యాపారం సాగిస్తున్నాయని, ఈ సిండికేట్ ఏర్పాటులో ఎక్సైజ్ శాఖలోని ఒక అధికారి కీలకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అధిక ధరలకు విక్రయాలు సాగుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోని ఎక్సైజ్ అధికారులు, ఒక మద్యం షాపు యజమాని సిండికేట్కు భిన్నంగా ఎంఆర్పీ ధరలకు సరఫరా చేయడంతో కన్నెర్రజేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో గూడూరు, మర్రిపల్లిగూడెం బెల్ట్ షాపులు ఆ వైన్స్ నుంచి మద్యం తెచ్చుకుని తక్కువ లాభంతో అమ్మడం ప్రారంభించాయి. ఇదే కారణంగా వారిపై లక్ష్యంగా దాడులు, నోటీసులు జారీ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధిక ధరలకు అమ్మినప్పుడు చర్యలు లేవు ఎంఆర్పీకి అమ్మితేనే కేసులా? అని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.
ఈ 8 రకాల బట్టలను చన్నీళ్లతో ఉతికితే రోగాలొస్తాయట.. తస్మాత్ జాగ్రత్త!
అనధికార బెల్ట్ షాపులపై..
మండల వ్యాప్తంగా కొనసాగుతున్న అనధికార బెల్ట్ షాపులపై సమానంగా చర్యలు తీసుకోకుండా, ఎంపిక చేసిన గ్రామాలపైనే దృష్టి కేంద్రీకరించడం వెనుక అసలు కారణం ఏమిటో ఎక్సైజ్ శాఖ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బెల్ట్ షాపులు చట్టవిరుద్ధమే అయితే అన్ని చోట్ల ఒకే విధంగా చట్టం అమలు చేయాలని, లేకపోతే సిండికేట్కు అనుకూలంగా వ్యవహరిస్తోందనే అపవాదును తప్పించుకోలేదని స్థానికులు హెచ్చరిస్తున్నారు. కమలాపూర్ మండలంలో ఎక్సైజ్ శాఖ తీరుపై పెరుగుతున్న అనుమానాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

