Gurukul Timings: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలోని సామాజిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల పనివేళలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీల టైం టేబుల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాబోయే 2026-27 విద్యాసంవత్సరం(జూన్ 12) నుంచి ఈ నూతన కాలపట్టిక అమలులోకి రానుంది.
గత విద్యాసంవత్సరంలో..
కొత్త ఉత్తర్వుల ప్రకారం, గురుకులాలు ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పని చేస్తాయి. ఉదయం 9 గంటల నుంచి 9:15 గంటల వరకు ప్రార్థన సమయం ఉండగా, ఉదయం 9:15 గంటలకు మొదటి పీరియడ్ ప్రారంభమవుతుంది. గత విద్యాసంవత్సరంలో ఉదయం 8 గంటలకే పాఠశాలలు ప్రారంభమై, 8:15 గంటలకే మొదటి పీరియడ్ మొదలయ్యేది. ఉదయాన్నే క్లాసులు ప్రారంభం కావడం వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అల్పాహారం కూడా సరిగ్గా తినలేకపోతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. అయితే విద్యార్థులు ఉదయం 5 గంటలకు నిద్రలేవడం, రాత్రి 9:00 గంటలకు నిద్రపోవాలనే నిబంధనలలో ఎలాంటి మార్పులు లేవు. ఈ నూతన వేళల వల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు.
Also read: డబ్బులు కట్టాలా? వాట్సప్, ఇన్స్టాగ్రామ్లో పెయిడ్ ఫీచర్లు.. మెటా ప్లాన్స్ ఇవే!
మల్క కొమురయ్య ప్రతిపాదనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల టైం టేబుల్పై పున:సమీక్ష చేయాలని, అలాగే కామన్ స్టాఫ్ ప్యాట్రన్, కామన్ ప్రమోషన్ ఛానల్ అమలు చేయాలని ఇటీవల ప్రభుత్వానికి ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ప్రతిపాదనలు పంపించారు. తన ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మార్పులు చేపట్టిందని మల్క కొమురయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్పులు చేయడంపై ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గురుకులాల్లో టైం టేబుల్ మార్చాలన్న డిమాండ్ చాలా రోజులుగా పెండింగ్ లో ఉండగా ఈ సమస్యపై శాసనమండలిలోనూ కొమురయ్య పలుమార్లు ప్రస్తావించారు.
Also read: తండ్రి దాచిన రహస్యం.. ముక్కలైన కుటుంబం: ఓటీటీలోకి మైండ్ బ్లాక్ చేసే ఫ్యామిలీ డ్రామా

