మళ్లీ తెలంగాణలో విగ్రహాల రాజకీయం రాజుకుంది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన తరుణంలో జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ట్యాంక్బండ్పై మిలియన్ మార్చ్ కార్యక్రమం ఉద్యమ మైలురాయిగా మిగిలింది.
ట్యాంక్బండ్పై ఆంధ్రా నాయకుల విగ్రహాలను టార్గెట్ చేసి ధ్వంసం చేశారు తెలంగాణ ఉద్యమకారులు. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా ఆ ఉద్యమవేడి ఆగలేదు. వారిని ఆపతరం కూడడా కాలేదు. భాష్పవాయు గోళాలు ప్రయోగించినా.. వాటర్ క్యానన్లతో చెదరగొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
నాడు ఎన్టీఆర్ హయాంలో ట్యాంక్బండ్పై నిర్మించిన ఆంధ్ర వైతాళికులు విగ్రహాలను టార్గెట్ చేసి ధ్వంసం చేశారు. తెలంగాణ అస్థిత్వ పోరాట ఉనికిని చాటుకునే ప్రయత్నంతో పాటు.. స్వరాష్ట్రం కావాలనే ఆకాంక్షను ఢిల్లీకి తెలియజేసేందుకు ఈ కార్యచరణను ఎంచుకున్నారప్పుడు తెలంగాణ జనం. ఈ మిలియన్ మార్చ్ను ఈజిప్టులోని తెహ్రీర్ స్క్వేర్లో జరిగిన చారిత్రాత్మక ఉద్యమంతో, నిరసనతో పోల్చి చూసింది జాతీయ మీడియా. దేశ రాజకీయాలు. ఇప్పుడు ఆ మిలియన్ మార్చి ఉదంతాన్ని పరోక్షంగా గుర్తుకు తెచ్చారు టీఆరెస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. ఆమె ఇవాళ ఉద్యమకారులతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో తెలంగాణలో రేపు పవన్ కళ్యాణ్ మీటింగు అంశం గురించి వచ్చిన చర్చలో ఆమె తీవ్రంగా స్పందించారు.
తెలంగాణలో ఆంధ్ర ప్రాంత నాయకులు విగ్రహాలు విరివిగా పెట్టే సంస్కృతి మొదలైంది… అని ఆమె పరోక్షంగా మొన్నటి ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనను గుర్తు చేస్తూ సీఎం రేవంత్రెడ్డి తీరును తప్పుబట్టారు. ఏపీ సర్కార్తో ఉన్న దోస్తానా వల్లే ఇది జరుగుతున్నదని, టీఆరెస్ అధికారంలోకి రాగానే ఇక్కడి ఆంధ్ర ప్రాంత విగ్రహాలన్నీ కూల్చేసి వాటిని ఆంధ్రకు పార్శిల్ చేస్తామని ఆమె హెచ్చరించడం కలకలం రేపింది. ఇక్కడి ప్రజలంతా తెలంగాణకు చెందిన వాళ్లేనని, సెటిలర్లని కూడా తెలంగాణ వాళ్లుగానే అక్కున చేర్చుకుని వారిని ఆదిరిస్తున్నామని, ప్రాంతాలుగా విడిపోయి ప్రశాంతంగా ఉంటున్న తమను.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా ఆంధ్ర పాలకులు ప్రయత్నం చేయొద్దని ఆమె పవన్ను, చంద్రబాబును హెచ్చరించారు.
ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు పై ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా చప్పుడు చేయలేదు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మౌనంగా ఉన్న సమయంలో టీఆరెస్ చీఫ్ కవిత మాత్రం.. ఆ ఉదంతాన్ని ఎత్తి చూపడంతో పాటు.. ట్యాంక్బండ్పై ఉన్న ఆంధ్ర విగ్రహాలను కూడా కూల్చుతామనడం చర్చకు తెర తీసింది. ఏపీలో కూడా తెలంగాణ వైతాళికులు విగ్రహాలు పెట్టాలనే డిమాండ్ కూడా ఆమె చేశారు. కానీ అక్కడి సర్కార్ అంత సాహసం చేసే పరిస్థితి లేదని ఆమెకు తెలుసు. అక్కడి రాజధాని కోసం 80వేల ఎకరాల రైతుల భూమిని సేకరించడం వెనుక పెద్ద కుట్ర ఉందని, ఆంధ్ర ప్రజల, రైతాంగం కోసం కూడా తాము పోరాడుతామని ప్రకటించడం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కవిత మాటలు చర్చనీయాంశమయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం మిన్నకుండిపోగా.. కవిత మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా.. తమ పార్టీ విధానాన్ని ఇక్కడి జనం ఆకాంక్షల మేరకు స్పష్టంగా స్పందించడం రాజకీయంగా చర్చలో భాగమైంది.

