Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన పార్టీ 'ఉద్యమి ఆత్మీయ సమావేశం' లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కేవలం ఒక్కడితో మొదలైన జనసేన ప్రస్థానం, ఈరోజు 21.5 లక్షల మంది జనసైనికులతో ఒక బలమైన శక్తిగా ఎదిగిందని ఆయన గర్వంగా చెప్పుకొచ్చారు. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ కోసం పనిచేయడానికి సుమారు 10 వేల మందికి పైగా ఉద్యమి సభ్యత్వం తీసుకోవడం విశేషమన్నారు. జనసేన కేవలం ఒక ప్రాంతీయ భావజాలం ఉన్న పార్టీ కాదని, జాతీయ సమగ్రత, జాతీయ భావాలు కలిగిన పార్టీ అని ఆయన స్పష్టం చేశారు.
పవన్ ఆరోగ్య పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు
ఇదే సమావేశంలో పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య పరిస్థితిపై కూడా కీలక విషయాలను పంచుకున్నారు. గత ఎన్నికల సమయంలో దుమ్ము, ధూళిలో విపరీతంగా తిరగడం, అంతకుముందు కరోనా సమయంలో వచ్చిన లంగ్స్ ఇన్ఫెక్షన్ కారణంగా ప్రస్తుతం తాను సైనస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, కార్యక్రమాల్లో అభిమానులు చూపే అమితమైన ప్రేమ వల్ల, వారు తనను దగ్గరకు లాగడం వల్ల భుజాల్లో చీలికలు వచ్చి నొప్పులు పుడుతున్నాయని పేర్కొన్నారు. అయితే చిన్నప్పటి నుంచి తనకు స్పోర్ట్స్ ట్రైనింగ్ ఉండటం వల్లే, ఆ అలవాటుతోనే ఈ శారీరక బాధలన్నింటినీ తట్టుకొని నిలబడగలుగుతున్నానని ఆయన వివరించారు.
పొరుగు రాష్ట్ర రాజకీయాలతో పోల్చవద్దు
మరోవైపు పొరుగు రాష్ట్ర రాజకీయాలతో జనసేనను పోల్చడంపై వైసీపీ మైండ్గేమ్కు, విమర్శకులకు పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. 'పక్క రాష్ట్రంలో (తమిళనాడులో) ఒకరు పార్టీ పెట్టి గెలవగానే.. నన్ను కూడా అలాగే చేసి ఉండాల్సిందని కొందరు అంటున్నారు. కానీ తమిళనాడు పరిస్థితులు వేరు, ఏపీ పరిస్థితులు వేరు. నేను ఇక్కడ దశాబ్ద కాలం పాటు నలిగాను, ఎందరో రౌడీలను తట్టుకొని నిలబడ్డాను. ఒకానొక దశలో అందరూ నన్ను వదిలేసినా, ఒంటరిగానే పార్టీని ముందుకు నడిపించాను. 2019లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు రెండు చోట్లా ఓడించారు. కాబట్టి దయచేసి జనసేనను ఆ పార్టీతో పోల్చకండి' అంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు.

